ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్: కాంతారాకు సీక్వెల్.. హోంబలే సంస్థ ప్రకటన

ప్రస్తుతం కాంతారా దర్శకుడు రిషబ్ శెట్టి విదేశాల్లో ఉన్నాడని.. ఆయన తిరిగి రాగానే చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని హోంబలే ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్లు తెలిపారు.

Advertisement
Update: 2022-12-22 06:57 GMT

2022లో విడుదలైన సినిమాల్లో అతి పెద్ద సంచలం సృష్టించిన మూవీగా కాంతారా ముందుంటుంది. 2022లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు అతి పెద్ద బ్లాక్ బాస్టర్లుగా నిలిచినప్పటికీ సంచలనం సృష్టించిన సినిమా మాత్రం కాంతారానే. కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్‌లపై ప్రేక్షకుల్లో ముందుగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే అవి విజయం సాధించాయి.

కానీ ఎటువంటి అంచనాలు లేకుండా..కనీసం స్టార్ హీరో లేకుండా.. భారీ బడ్జెట్ లేకుండా సంచలన విజయం సాధించిన సినిమా కాంతారా. ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి కన్నడలో కూడా పేరున్న నటుడు కాదు. అప్పటివరకు అక్కడ కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగానే అతడికి గుర్తింపు ఉంది. స్వీయ దర్శకత్వంలో తనే హీరోగా రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతారా కేవలం రూ.15 కోట్లతో నిర్మితమై దేశవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

కాగా ఈ సినిమాకు సంబంధించి మరొక స‌ర్‌ప్రైజ్‌ను ఈ మూవీని నిర్మించిన హోంబలే ప్రొడక్షన్స్ ప్రకటించింది. కాంతారా సినిమాకు కొనసాగింపు ఉంటుందని తాజాగా ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఆ సినిమాకు సీక్వెల్ తీయాలా.. లేకపోతే ప్రీక్వెల్ చేయాలా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం కాంతారా దర్శకుడు రిషబ్ శెట్టి విదేశాల్లో ఉన్నాడని.. ఆయన తిరిగి రాగానే చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని హోంబలే ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్లు తెలిపారు. సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేయడానికి రిషబ్ శెట్టి అంగీకరిస్తే అతి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తామని వారు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News