కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు.. - సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్లో ఘటన
పార్టీ సంస్థాగత కమిటీల నియామకం విషయంలో కోడెల శివరాం, జీవీ ఆంజనేయులు వర్గాల మధ్య విభేదాలు చెలరేగి ఘర్షణ చోటుచేసుకుంది. ఏకంగా కుర్చీలతో కొట్టుకున్నారు.
తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారు.. ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరేసుకున్నారు.. నోటికొచ్చినట్టు బూతులూ తిట్టుకున్నారు.. పార్టీ నేతలు కోడెల శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు మధ్య అయితే మాటల తూటాలు భారీగా పేలాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భవన్ ఇందుకు వేదికైంది.
గురువారం పార్టీ సంస్థాగత నియామకాల కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. పార్టీ సంస్థాగత కమిటీల నియామకం విషయంలో కోడెల శివరాం,వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య విభేదాలు చెలరేగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల కార్యకర్తలు, నాయకులు ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహీకి దిగారు. ఏకంగా కుర్చీలతో కొట్టుకున్నారు.
వేరే ప్రాంత టీడీపీ నేతలు సత్తెనపల్లి వచ్చి పెత్తనం చేయడమేమిటని కోడెల శివరాం వర్గం మండిపడుతోంది. కాగా, వైవీ ఆంజనేయులు గతంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, TDP గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
తాజా గొడవతో వైవీ ఆంజనేయులు కమిటీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ భవన్లో మాత్రం ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది.