నా టికెట్‌ బాధ్యత చంద్రబాబుదే.. లేకపోతే - RRR

రఘురామకృష్ణంరాజుకు బీజేపీ హ్యాండిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై ఆశలు పెట్టుకున్నారు.

Advertisement
Update: 2024-03-26 12:32 GMT

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. మొన్నటివరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో తిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చిన రఘురామకృష్ణంరాజు.. ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇచ్చిన మాట తప్పి బీజేపీ తనను మోసం చేసిందంటున్నారు. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును కూడా టార్గెట్‌ చేశారు. బీజేపీ మోసం చేసింది కాబట్టి తనకు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుదేనన్నారు రఘురామకృష్ణం రాజు.

ఓ మీడియా ఛానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘురామ.. బీజేపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి తనకు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన పార్టీల మీదే ఉందన్నారు. నరసాపురంలోనే తెలుగుదేశం పార్టీ తనకు టికెట్ ఇవ్వాలన్నారు RRR. నమ్ముకున్న తనకు ఒక సీటు ఇప్పించలేని వాడు.. రేపు కేంద్రంతో పోరాడి పోలవరం కడతాను, రాష్ట్రానికి ఇంకేదో తీసుకువస్తానంటే చంద్రబాబును ప్రజలు నమ్ముతారా అంటూ కామెంట్స్ చేశారు రఘురామకృష్ణంరాజు. త్వరలోనే బీజేపీ తన తప్పు తెలుసుకుని నరసాపురం అభ్యర్థిని మార్చే అవకాశం ఉందంటూ ఇంకా ఆశలు పెట్టుకున్నారు.

రఘురామకృష్ణంరాజుకు బీజేపీ హ్యాండిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై ఆశలు పెట్టుకున్నారు. నరసాపురం నుంచి బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడంతో తెలుగుదేశం అభ్యర్థిగా విజయనగరం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News