టీడీపీ, జనసేన, బీజేపీలను చిత్తుగా ఓడించండి

ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు చేసిన మేలు ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు.

Advertisement
Update: 2024-05-09 06:53 GMT

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మిని చిత్తు చిత్తుగా ఓడించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు చేతులు కలిపారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు బీజేపీతో పాటు ఆ పార్టీతో జట్టు కట్టిన టీడీపీ, జనసేనను ఓడించేందుకు జనం ముందుకు రావాలన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజీగూడెంలో బుధవారం నిర్వహించిన బహిరంగసభలో సీతారాం ఏచూరి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు చేసిన మేలు ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. బీజేపీ వల్ల దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే హిందుత్వ అజెండా అమలు చేసేందుకు రాజ్యాంగాన్ని కూడా పక్కనపెడతారని హెచ్చరించారు. మైనార్టీల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టి వివక్షతను కూడా బీజేపీ ప్రదర్శిస్తుందని చెప్పారు. ఏపీని ఎన్డీయే విముక్త రాష్ట్రంగా చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలను ఓడించాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు మాటలు నమ్మొద్దు

ఏపీ ప్రజలకు తీవ్ర ద్రోహం చేసిన పార్టీ బీజేపీ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ చెప్పారు. విభజన చట్టంలోని హామీలను ఆ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. అలాంటి పార్టీతో జత కట్టిన చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మొద్దని ఆమె పిలుపునిచ్చారు. పాడేరులో సీపీఎం నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు.

Tags:    
Advertisement

Similar News