చంద్రబాబు చెంచా పవన్..జనసేనానిపై జోగి రమేష్ ఫైర్

పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సీఎం కాలేడు. ఎందుకంటే అతడికి ఒక లక్ష్యం లేదు.. జెండా లేదు. అతడిని నమ్ముకుంటే నట్టేట ముంచుతాడు.

Advertisement
Update: 2022-12-19 12:20 GMT

చంద్రబాబు చెంచా పవన్ కళ్యాణ్ అని.. అతన్ని నమ్ముకుంటే జన సైనికులను నట్టేట ముంచుతాడని ఏపీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వారానికి ఓసారి విజిటింగ్ వీసా మీద రాష్ట్రానికి వచ్చి ఏదో ఒకటి వాగిపోతుంటాడని అన్నారు. నిన్న కూడా అలాగే వచ్చి వాగిపోయాడని విమర్శించారు. 'పవన్ కళ్యాణ్ ఒక్కడిగా పోటీ చేయలేడు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతానని చెప్పే ధైర్యం కూడా లేదు. కానీ వైసీపీని ఓడిస్తా.. ఓటు చీలకుండా చూస్తానని అంటుంటాడు. పవన్‌కు తెలిసిందల్లా చంద్రబాబుకు చెంచాగిరి చేయడమే. పవన్‌ను జన సైనికులు నమ్మితే తీసుకెళ్లి చంద్రబాబుకు అమ్మేస్తాడు.

పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సీఎం కాలేడు. ఎందుకంటే అతడికి ఒక లక్ష్యం లేదు.. జెండా లేదు. అతడిని నమ్ముకుంటే నట్టేట ముంచుతాడు.' అని జోగి రమేష్ పవన్‌పై ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలను పవన్ కళ్యాణ్ గాడిదలతో పోల్చడంపై కూడా జోగి రమేష్ స్పందించారు. గాడిదలు ఎవరో అడ్డ గాడిదలు ఎవరో ప్రజలకు బాగా తెలుసు.. ఆయన అని వ్యాఖ్యానించారు.

జగన్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, పవన్ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలే తరిమికొడతారన్నారు. పవన్ తన వారాహి వాహనాన్ని అడ్డుకుంటే నా పవర్ ఏంటో చూపిస్తానని.. సవాల్ విసురుతున్నాడని.. అతడి వాహనాన్ని అడ్డుకోవాల్సిన అవసరం మాకు ఏముందని జోగి రమేష్ ప్రశ్నించారు. పవన్ రాష్ట్రమంతా తిరిగితే ఎవరూ వద్దని చెప్పరని.. కానీ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.


Tags:    
Advertisement

Similar News