రోడ్డు వేస్తే ఐదేళ్లు చెక్కు చెదరకూడదు -జగన్

గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లభించే పని దినాలతో గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు సీఎం జగన్.

Advertisement
Update: 2023-04-27 14:05 GMT

ఏపీలో కొత్తగా వేసే రోడ్లు ఐదేళ్లపాటు చెక్కు చెదరకూడదని అధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం జగన్. రోడ్ల నాణ్యతపైనా మరింత దృష్టిపెట్టాలన్నారు. రోడ్డు వేసిన తర్వాతి ఏడాదే రిపేరుకి వస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంజినీర్లు రోడ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించిన జగన్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఉపాధి పనులతో సచివాలయాలు, ఆర్బీకేలు..

గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లభించే పని దినాలతో గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు సీఎం జగన్. ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 15 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకూ 2.15 కోట్ల పనిదినాల కల్పన జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. పనిదినాల రూపంలో రూ. 5280 కోట్లు, మెటీరియల్‌ రూపంలో రూ.3520 కోట్లు ఉపాధి హామీ ద్వారా జరిగే పనులకు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

మహిళల స్వయం సాధికారత కోసం చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలు అమలు చేస్తున్నామని, వీటి ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే విధంగా అధికారులు ప్రోత్సహించాలని చెప్పారు సీఎం జగన్. లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిన మొదటి ఏడాది నుంచే వారిని స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను మరింత పెంచాలని చెప్పారు. అర్హులైన మహిళల్లో మరింత అవగాహన కల్పించి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్‌ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలతో సూపర్‌ మార్కెట్‌ లు ఏర్పాటు చేయాలన్నారు జగన్. జిల్లాకు కనీసం రెండు సూపర్‌ మార్కెట్‌ లు ఏర్పాటు కావాలని చెప్పారు. మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్‌ వ్యవస్ధ ఉండాలని ఆదేశించారు. 

Tags:    
Advertisement

Similar News