అప్లై చేయండి.. నారా దేవాన్ష్ కి అమ్మఒడి ఇస్తాం

తమ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు మాజీ మంత్రి వెల్లంపల్లి. అర్హత ఉంటే, నారా దేవాన్ష్ పేరు కూడా అమ్మఒడి జాబితాలో ఉంటుందని స్పష్టం చేశారు వెల్లంపల్లి.

Advertisement
Update: 2022-10-28 08:30 GMT

అర్హత ఉంటే, దరఖాస్తు చేస్తే.. నారా దేవాన్ష్ కి కూడా అమ్మఒడి ఇస్తామంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ హయాంలో టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తలే కాదు, టీడీపీ నేతలు కూడా సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారని చెప్పారాయన. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికి వెళ్లి మరీ ఆ కుటుంబానికి అందిన సంక్షేమ పథకాల కార్డుని అందజేశారు. వర్ల రామయ్య భార్య జయప్రదకు రైతు భరోసా కింద 13,500 రూపాయలు అందినట్టు ధృవీకరణ పత్రం అందజేశారు. ఆ సమయంలో వర్ల రామయ్య దంపతులు ఇంట్లోనే ఉన్నా కూడా బయటకు రాలేదు. దీంతో డ్రైవర్ కి ఆ ధృవీకరణ పత్రం ఇచ్చి వచ్చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 'గడప గడపకి మన ప్రభుత్వం' కార్యక్రమంలో వెల్లంపల్లి పాల్గొన్నారు. ప్రతిరోజూ ఆయన నియోజకవర్గంలో కలియదిరుగుతూ ప్రజలకు అందిన లభ్ధి వివరాలను తెలియజేస్తూ, వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు విద్యాధర పురంలో పర్యటించారు వెల్లంపల్లి. అక్కడే వర్ల రామయ్య కుటుంబం నివశిస్తోంది. ఆ కుటుంబం కూడా లబ్ధిదారుల జాబితాలో ఉందని వాలంటీర్ తెలియజేశారు. ఇంకేముంది వెంటనే ఆ ధృవీకరణ పత్రం పట్టుకుని వర్ల రామయ్య ఇంటికెళ్లారు వెల్లంపల్లి.

వర్ల రామయ్య ఆ సర్టిఫికెట్ తీసుకోలేరు, అలాగని తన భార్యకు రైతు భరోసా వద్దని చెప్పలేరు. మొత్తమ్మీద వైసీపీకి మాత్రం ఇలా మంచి ప్రచారం దొరికినట్టయింది. టీడీపీ కీలక నేతలకి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్న వైసీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు చాలామంది తమ పథకాలతో లబ్ధి పొందుతున్నారని అంటున్నారు. టీడీపీ హయాంలో కూడా ఆ స్థాయిలో వారికి లబ్ధి చేకూరలేదని, తమ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. అర్హత ఉంటే, నారా దేవాన్ష్ పేరు కూడా అమ్మఒడి జాబితాలో ఉంటుందని స్పష్టం చేశారు వెల్లంపల్లి.

Tags:    
Advertisement

Similar News