నా కుటుంబానికి రక్షణ కల్పించండి.. పోలీసులకు పూరీ జగన్నాథ్ ఫిర్యాదు

ఈ విషయం పూరీ జగన్నాథ్ దృష్టికి వెళ్లడంతో కొందరు తన పరువు తీసేందుకు ఆందోళనలు చేయాలని చూస్తున్నారని, అలాంటివారికి పైసా కూడా చెల్లించనని ఆయన హెచ్చరించారు.

Advertisement
Update: 2022-10-27 02:27 GMT

తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్ లపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరు తమ కుటుంబంపై దాడి జరిపేలా ఇతరులను రెచ్చగొడుతున్నారని పూరీ జగన్నాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో లైగర్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవగా, ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు.

దీంతో వారు తాము చెల్లించిన మొత్తంలో కొంతమేర తిరిగి చెల్లించాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ ను కోరారు. ఇందుకు ఆయన నెల రోజుల సమయం కోరారు. అయితే పూరీ జగన్నాథ్ గడువు అడిగినప్పటికీ కొందరు డిస్ట్రిబ్యూటర్లు పూరీ జగన్నాథ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

ఈ విషయం పూరీ జగన్నాథ్ దృష్టికి వెళ్లడంతో కొందరు తన పరువు తీసేందుకు ఆందోళనలు చేయాలని చూస్తున్నారని, అలాంటివారికి పైసా కూడా చెల్లించనని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఈ విషయమై పూరీ జగన్నాథ్ మాట్లాడిన ఒక ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా తాజాగా పూరీ జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీసులను కలసి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు.

Tags:    
Advertisement

Similar News