కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుందనుకుంటే నాకు ఓటేయొద్దు: శశిథరూర్

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కార్యకలాపాలపై మీరు సంతృప్తి చెందినట్టయితే దయచేసి ఖర్గే కు ఓటేయండి. ఒకవేళ మీరు మార్పు కోరుకుంటున్నట్టయితే నాకు ఓటేయండి అని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను కోరారు.

Advertisement
Update: 2022-10-01 11:17 GMT

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎట్టకేలకు ఒక రూపుకొచ్చాయి. అక్టోబరు 17న ఎన్నికలు జరగనున్నాయి. చివరకు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ లు రంగంలో మిగిలారు. మల్లికార్జున్ ఖర్గేకు అధిష్టానం ఆశీర్వాదం ఉందనే వార్తల నేపథ్యంలో శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సంతృప్తికరంగా పని చేస్తుందనుకుంటే మల్లికార్జున్ ఖర్గేకు, లేదూ పార్టీలో మార్పు కావాలనుకుంటే తనకు ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు.

"కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ నేను చెప్పేదొక్కటే... కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కార్యకలాపాలపై మీరు సంతృప్తి చెందినట్టయితే దయచేసి ఖర్గే కు ఓటేయండి. ఒకవేళ మీరు మార్పు కోరుకుంటున్నట్టయితే నాకు ఓటేయండి. పార్టీ వ్యవహార సరళి నచ్చనివారు నన్ను ఎంచుకోండి... పార్టీలో మార్పు తీసుకువచ్చేందుకు నేను సిద్ధమే! సిద్ధాంతపరమైన సమస్యలేమీ లేవు" అంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

అంతే కాదు ఇది ఒకే పార్టీలో జరుగుతున్న పోటీ మాత్రమే అని, యుద్దం కాదని వ్యాఖ్యానించారు శశిథరూర్. ఖర్గే, తాను ఒకే పార్టీకి చెందిన భిన్న దృక్పథాలకు చెందినవాళ్లమని, విజేత ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిర్ణయిస్తారని శశిథరూర్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News