మైనార్టీ సబ్ ప్లాన్ ఓ మైలురాయి.. వైసీపీ మేనిఫెస్టోపై ముస్లింల హర్షం

దివంగత నేత వైఎస్ఆర్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయించారని, ఆయన తనయుడిగా ఆ రిజర్వేషన్లు కొనసాగిస్తూ మైనార్టీ సంక్షేమానికి మేనిఫెస్టోలో జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు మైనార్టీ నేతలు.

Advertisement
Update: 2024-04-27 11:20 GMT

వైసీపీ మేననిఫెస్టోపై అన్ని వర్గాలు హర్షం చేస్తున్నాయి. ముఖ్యంగా మైనార్టీలు సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మైనార్టీల సబ్ ప్లాన్ అమలు దేశ చరిత్రలోనే మైలు రాయి లాంటిదని, ముస్లింల హృదయాలలో జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని వారు కొనియాడారు. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

2019-2024 మధ్య కాలంలో ఏపీ మైనార్టీస్ కాంపోనెంట్ చట్టం (సబ్ ప్లాన్) పారదర్శకంగా అమలు చేశారని, అది సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు షేక్ నాగుల్ మీరా. DBT, నాన్ DBT ద్వారా ముస్లిం మైనార్టీలకోసం ప్రభుత్వం రూ.25వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో ముస్లింలకు కేటాయింపులు జరగలేదని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి పాతిక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేవలం సీఎం జగన్ మాత్రమేనని కొనియాడారు.

సంక్షేమం యథాతథం..

ఇప్పటి వరకు అమలైన సంక్షేమ కార్యక్రమాలను యథాతథంగా అమలు చేస్తామని చెప్పడం విప్లవాత్మకమైన నిర్ణయం అన్నారు షేక్ నాగుల్ మీరా. ఈ నిర్ణయం ద్వారా సీఎం జగన్ విశ్వసనీయత మరోసారి రుజువైందని చెప్పారు. దివంగత నేత వైఎస్ఆర్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయించారని, ఆయన తనయుడిగా ఆ రిజర్వేషన్లు కొనసాగిస్తూ మైనార్టీ సంక్షేమానికి మేనిఫెస్టోలో జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఉర్దూని రెండో అధికార భాషగా గుర్తించి, మైనార్టీల పక్షపాతిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ముస్లిం ప్రార్థన మందిరాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరచడం పట్ల ఆ వర్గం నేతలు హర్షం వ్యక్తం చేశారు.

జగన్ తోనే మేమంతా..

కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని ధైర్యంగా చెబుతున్నారని, అలాంటి వారికి తమ వర్గం నుంచి ఒక్క ఓటు కూడా పడదని స్పష్టం చేస్తున్నారు మైనార్టీ నేతలు. కుహనా లౌకికవాద పార్టీలయిన టీడీపీ, జనసేన.. మతోన్మాద పార్టీ బీజేపీతో జతకలిసి మైనార్టీల రిజర్వేషన్ల ఫలాలు వారికి అందకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీలో మైనార్టీ వర్గం అంతా జగన్ వెంటే ఉంటుందని అన్నారు.

Tags:    
Advertisement

Similar News