''ఒకడే కదా పోనిలే'' అనుకోరు జగన్.. ఒకటి అనుకుంటే పది పోవచ్చు..

ఒక సీటు ఓడిపోతే పర్వాలేదు అనుకుంటే పదిసీట్లలో ఓడిపోయే ప్రమాదం ఉంటుందని.. అందుకే 175 సీట్లు గెలిచేందుకు లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని వివరించారు.

Advertisement
Update: 2022-09-29 09:59 GMT

టీడీపీ లాంటి పనికిమాలిన పార్టీని ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. 175 సీట్లు గెలవడం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. జగన్‌ నిజమైన నాయకుడు కాబట్టే 175 సీట్లు గెలుస్తామని, గెలవాలని చెబుతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. ఒక నాయకుడిగా తనతో ఉన్న ప్రతి ఒక్కరూ గెలవాలని జగన్ కోరుకుంటున్నారని చెప్పారు.

తనతోపాటు పోటీ చేస్తున్న వారిలో ఒకరు ఓడిపోయినా పర్వాలేదు అనుకోవడం నాయకత్వ లక్షణం కాదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఒక సీటు ఓడిపోతే పర్వాలేదు అనుకుంటే పదిసీట్లలో ఓడిపోయే ప్రమాదం ఉంటుందని.. అందుకే 175 సీట్లు గెలిచేందుకు లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని వివరించారు. ఇది అత్యాశ కానేకాదన్నారు. ఇప్పటి వరకు మొత్తం సీట్లు ఏ పార్టీ గెలవలేదని చెబుతున్నారని.. అలా గెలవడం వైసీపీతోనే ప్రారంభమవుతుందన్నారు. టీడీపీ లాంటి పనికిమాలిన పార్టీని ప్రజలు ప్రతిపక్షంగా ఉంచేందుకు కూడా ఇష్టపడడం లేదన్నారు.

వారసులు అందరికీ ఉంటారని.. తనకు కూడా కొడుకు ఉన్నాడ‌ని.. ఎవరైనా రాజకీయాల్లో నిలబడాలంటే ప్రజల ఆమోదం ముఖ్యమన్నారు. నిన్నటి సమావేశంలో సీఎం జగన్ ఎవరికీ క్లాస్ తీసుకోలేదని.. లోటుపాట్లను మాత్రమే చెప్పారని బొత్స వివరించారు. వివిధ పరీక్షలకు సంబంధించిన ఫలితాల విడుదలకు విద్యా శాఖ మంత్రిగా ఉన్న తాను రావాల్సిన అవసరం లేదని.. వాటిని ఇకపై అధికారులే విడుదల చేయాలని బొత్స సూచించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే మాత్రం తనను పిలవాలన్నారు.

Tags:    
Advertisement

Similar News