యువగళంలో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుస విజయాలు టీడీపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చినట్టు స్పష్టమవుతోంది. ఈ దశలో నారా లోకేష్ యాత్రపై కూడా టీడీపీ ఫోకస్ పెంచింది.

Advertisement
Update: 2023-03-25 08:09 GMT

యువగళం పాదయాత్రలో భాగంగా ఆమధ్య నారా లోకేష్ యువతతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. యువత రాజకీయాల్లోకి రావాలని, జూనియర్ ని కూడా రాజకీయాల్లోకి తాను ఆహ్వానిస్తానన్నారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. అసలు ఎన్టీఆర్ తాత పెట్టిన పార్టీలోకి ఆయన్ను ఇంకొకరు ఆహ్వానించడమేంటని సెటైర్లు పడ్డాయి. అప్పటితో ఆ గొడవ ముగిసిపోయినా, మళ్లీ ఇప్పుడు యువగళంలో జూనియర్ పేరు బలంగా వినిపించింది. ఈసారి నారా లోకేష్ సోదరుడు, సినీ హీరో నారా రోహిత్.. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై రియాక్ట్ అయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుస విజయాలు టీడీపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చినట్టు స్పష్టమవుతోంది. ఈ దశలో నారా లోకేష్ యాత్రపై కూడా టీడీపీ ఫోకస్ పెంచింది. తాజాగా సినీ హీరో నారా రోహిత్ యువగళం యాత్రకు సంఘీభావం తెలిపారు. లోకేష్ తో కలసి కొంతదూరం ఆయన యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ డెఫన్స్‌లో పడిందని, అందుకే తెలుగుదేశం పార్టీపై బురదజల్లుతున్నారని విమర్శించారు రోహిత్. యువగళం పాదయాత్ర ముందు ముందు ఏపీలో ప్రభంజనంగా మారుతుందని చెప్పారు.


యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు నారా రోహిత్. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని నారా రోహిత్ పేర్కొన్నారు. ఇటీవల లోకేష్ మూడురోజులు యాత్రకు విరామం ప్రకటించారు. విరామం తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ 50వరోజు పాదయాత్ర ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయం తర్వాత లోకేష్ లో కూడా కొత్త ఉత్సాహం కనపడుతోంది. 

Tags:    
Advertisement

Similar News