జగన్ ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించారా..?

తాజాగా జరిగిన వర్క్ షాపులో ఇదే విషయాన్ని మంత్రులు, ఎంఎల్ఏల్లో కొందరు జగన్ దగ్గరే ప్రస్తావించారట. దాంతో విషయం అర్థ‌మైంది. అందుకనే స్కూళ్ళల్లో విద్యార్ధులకు ఇవ్వబోయే ట్యాబులను మంత్రులు, ఎంఎల్ఏల ద్వారానే ఇప్పించాలని డిసైడ్ అయ్యారు.

Advertisement
Update: 2022-12-18 05:08 GMT

సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతి జరగకుండా అర్హులందరికీ అందాలని జగన్మోహన్ రెడ్డి అనుకోవటంలో తప్పులేదు. కానీ, ప్రభుత్వం అంటే తానొక్కడినే అని మంత్రులు, ఎంఎల్ఏలు ఇతర ప్రజాప్రతినిధులను డమ్మీలను చేయటం వల్ల తనకే నష్టమని జగన్ ఇప్పటికైనా గ్రహించారు. సంక్షేమ పథకాలు అందుకోవటంలో గడచిన మూడున్నరేళ్ళల్లో మంత్రులు, ఎంఎల్ఏల ప్రమేయమే లేకుండా చేసేశారు. జగన్ బటన్ నొక్కడం లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడిపోవటం.

ఇందుకనే ముఖ్యమంత్రి బ్రహ్మాండం మంత్రులు, ఎంఎల్ఏలు వేస్ట్ అని జనాలు అనుకునేట్లుగా తయారైంది పరిస్ధితి. దాదాపు ఇలాంటి పరిస్ధితే చంద్రబాబునాయుడు హయాంలో కూడా జరిగింది. కాకపోతే అప్పట్లో సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎక్కువగా డ్రామాలు జరిగాయి. ఇప్పుడు జగన్ హయాంలో నిజంగానే మెజారిటీ అర్హులకు పథకాలు అందుతున్నాయి. దీంతో జనాలను ఎక్కడ కదిల్చినా మంత్రులు, ఎంఎల్ఏలతో తమకేమి పని అని మొహంమీదే అడిగేస్తున్నారు.

తాజాగా జరిగిన వర్క్ షాపులో ఇదే విషయాన్ని మంత్రులు, ఎంఎల్ఏల్లో కొందరు జగన్ దగ్గరే ప్రస్తావించారట. దాంతో విషయం అర్థ‌మైంది. అందుకనే స్కూళ్ళల్లో విద్యార్ధులకు ఇవ్వబోయే ట్యాబులను మంత్రులు, ఎంఎల్ఏల ద్వారానే ఇప్పించాలని డిసైడ్ అయ్యారు. అలాగే రైతుభరోసా పథకంలో రైతులకు అందే డబ్బులను బటన్ నొక్కి ఖాతాల్లో వేసినా వాటి తాలూకు డమ్మీ చెక్కులను నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంఎల్ఏల ద్వారా రైతులకు పంపిణీ చేయించాలని జగన్ ఆదేశించారు. మూడున్నరేళ్ళుగా జరిగిందేమంటే పథకాల లబ్దిదారులకు ప్రజాప్రతినిధులకు మధ్య సంబంధాలే లేకుండా పోయాయి.

అలాగే గ్రామ, వార్డు సచివాలయాల కారణంగా ఏవైనా పనులుంటే జనాలు సచివాలయాలకు వెళుతున్నారే కానీ, ప్రజాప్రతినిదుల దగ్గరకు వెళ్ళటమే లేదు. దాంతో ఒక విధంగా మంత్రులు, ఎంఎల్ఏలు డమ్మీలుగా మారిపోయారు. ఏ అవసరం వచ్చినా మంత్రులు, ఎంఎల్ఏల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటని జనాలు అనుకుంటున్నారు. దాంతో మంత్రులు, ఎంఎల్ఏలు పరిస్ధితి ఏదో ఉన్నారంటే ఉన్నారన్నట్లుగా తయారయ్యింది. ఈ విషయాన్ని జగన్ ఇప్పటికైనా గ్రహించి పథకాల అమలులో మంత్రులు, ఎంఎల్ఏలను భాగస్వాములను చేయాలని డిసైడ్ అవటం సంతోషం.

Tags:    
Advertisement

Similar News