అయ్యప్ప స్వాములకు అనిల్ క్షమాపణ చెప్పాల్సిందే –బీజేపీ డిమాండ్

అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప మాలలో ఉన్నప్పడు అన్యమతాలకు చెందిన వస్త్రధారణ ఎందుకు చేశారంటూ మండిపడ్డారు విష్ణువర్ధ‌న్ రెడ్డి. ట్విట్టర్లో ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

Advertisement
Update: 2022-11-25 04:31 GMT

అయ్యప్ప స్వాములకు మాజీ మంత్రి అనిల్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధ‌న్ రెడ్డి. అయ్య‌ప్ప మాల ధరించిన అనిల్ అన్యమత కార్యక్రమానికి వెళ్లడంతోపాటు, అన్యమత వస్త్రధారణతో కనిపించడం సరికాదన్నారు. ఇవన్నీ ఓటుబ్యాంకు రాజకీయాలేనని విమర్శించారు. ఓట్లకోసం నాయకులు ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారాయన.

అసలేం జరిగింది..?

మాజీ మంత్రి అనిల్ ప్రస్తుతం అయ్యప్పమాల ధరించి ఉన్నారు. గడప గడప కార్యక్రమంలో కూడా ఆయన మాలధారణతోనే పాల్గొంటున్నారు. తాజాగా ఆయన నెల్లూరులోని ఖుద్దూస్ నగర్లో పర్యటించిన సందర్భంగా మైనార్టీలతో సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన ముస్లింలు ధరించే టోపీ పెట్టుకున్నారు. దీనిపై ఇప్పుడు బీజేపీ రాద్ధాంతం చేస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప మాలలో ఉన్నప్పడు అన్యమతాలకు చెందిన వస్త్రధారణ ఎందుకు చేశారంటూ మండిపడ్డారు విష్ణువర్ధ‌న్ రెడ్డి. ట్విట్టర్లో ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

వైసీపీ వివరణ ఇవ్వాల్సిందే..

ఏపీలో వైసీపీ నేతలు ప్రతిరోజూ ఏదో ఒక వివాదాస్పద అంశాలతో హిందువులను అవమానిస్తున్నారని అన్నారు విష్ణువర్ధ‌న్ రెడ్డి. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ హిందువులను అవమానించారని, వెంటనే వైసీపీ అధిష్టానం దీనిపై స్పందించాలన్నారు. అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాలని, పార్టీ దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News