ఉక్కు పిడికిలి సడలించం " ప్రధానికి సీఎం జగన్ మరో లేఖ..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంలో వెనక్కి తగ్గేది లేదని, నూటికి నూరుశాతం పెట్టుబడులు ఉపసంహరించుకోడానికే మొగ్గు చూపుతున్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసిన వేళ.. ఏపీలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ దశలో సీఎం జగన్ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై రెండోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు. అఖిల పక్ష సమావేశానికి అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ ఆ లేఖలో జగన్ మోదీని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఇచ్చిన సమాధానం రాష్ట్ర ప్రజలతో పాటు […]

Advertisement
Update: 2021-03-09 07:13 GMT

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంలో వెనక్కి తగ్గేది లేదని, నూటికి నూరుశాతం పెట్టుబడులు ఉపసంహరించుకోడానికే మొగ్గు చూపుతున్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసిన వేళ.. ఏపీలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ దశలో సీఎం జగన్ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై రెండోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు. అఖిల పక్ష సమావేశానికి అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ ఆ లేఖలో జగన్ మోదీని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఇచ్చిన సమాధానం రాష్ట్ర ప్రజలతో పాటు ప్లాంట్‌ ఉద్యోగుల్ని కూడా ఆందోళనకు గురిచేసిందని లేఖలో పేర్కొన్నారు. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు జగన్. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై గతంలోనూ తాను రాసిన లేఖ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం జగన్. స్టీల్‌ ప్లాంట్‌ ను లాభాల్లోకి తెచ్చేందుకు తాను సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను కూడా మరోసారి గుర్తు చేశారు.

“కేంద్ర ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశం. స్టీల్‌ ప్లాంట్‌పై ప్రత్యక్షంగా 20వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. అఖిలపక్షం, కార్మిక సంఘాల ప్రతినిధులను వెంట తీసుకొస్తాం. ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాం. ప్లాంట్‌ పునరుద్ధరణకై మన ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తాం” అని లేఖలో పేర్కొన్నారు జగన్.

గతంలో సీఎం జగన్ విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆయనతో భేటీ అయ్యాయి. ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, దీనికోసం ఎందాకైనే పోరాడతామని, ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని ఆయన మాటిచ్చారు. అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఆ మాటమేరకు.. ప్రధాని నరేంద్ర మోదీని నేరుగా కలసి సమస్య తీవ్రతను వారికి తెలియజేసి, పరిష్కార మార్గం కనుగునేందుకు అఖిల పక్ష భేటీకి అనుమతి కోరుతూ లేఖ రాశారు జగన్.

మరోవైపు విశాఖ కూర్మన్నపాలెం కూడలిలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు కార్మిక సంఘాల నేతలు. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది.

Tags:    
Advertisement

Similar News