మేం గాడిదలు కాయట్లేదు.... శాంతిభద్రతలు పరిరక్షిస్తున్నాం " పోలీస్ అధికారుల సంఘం

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా మండిపడింది. ‘పోలీసులు గాడిదలు కాస్తున్నారా..?’ అన్న వ్యాఖ్యలపై సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని అన్నారు. అకస్మాత్తుగా చోటు చేసుకునే అనివార్య పరిస్థితుతను దృష్టిలో పెట్టుకునే పోలీసులు స్పందిస్తారని ఆయన పేర్కొన్నారు. ఏ సందర్భంలో […]

Advertisement
Update: 2020-02-28 05:44 GMT

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా మండిపడింది. ‘పోలీసులు గాడిదలు కాస్తున్నారా..?’ అన్న వ్యాఖ్యలపై సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని అన్నారు. అకస్మాత్తుగా చోటు చేసుకునే అనివార్య పరిస్థితుతను దృష్టిలో పెట్టుకునే పోలీసులు స్పందిస్తారని ఆయన పేర్కొన్నారు. ఏ సందర్భంలో ఏం చేయాలో.. సమయస్పూర్తితో వ్యవహరించి శాంతి భద్రతలను ఎలా కాపాడాలో పోలీసులకు తెలుసని అన్నారు. చట్టపరంగా వ్యవహరించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆ ప్రకటనలో చెప్పారు.

14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి ఇలాంటి విషయాలు తెలియకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. విశాఖలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆందోళనకారుల నుంచి చంద్రబాబుకు ఎటువంటి హాని కలుగకుండా అక్కడ ఉన్న పోలీసులు సమయస్పూర్తితో వ్యవహరించారని ఆయన అన్నారు. ఆయనకు ఒక రక్షణ కవచంలా ఉండి సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన పోలీసులను పట్టుకొని.. మీ సంగతి చూస్తా అని వ్యాఖ్యానించడం సబబేనా ఆని ఆయన ప్రశ్నించారు.

కేవలం చంద్రబాబు మాత్రమే కాకుండా ఆయన కుమారుడు కూడా మేం అధికారంలోకి వస్తే ఎవరినీ వదిలిపెట్టమనే బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ఎంత వరకు సమంజసమని పోలీస్ అధికారుల సంఘం తరపున ప్రశ్నిస్తున్నామని ఆయన అన్నారు. ఈ మధ్య సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ నాయకులు బెదిరించడం పరిపాటిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు, లోకేష్… పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రకటనలో డిమాండ్ చేశారు.

కాగా, నిన్న ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న నారా చంద్రబాబుకు నిరసనల సెగ తగిలింది. విశాఖను రాజధానిగా అంగీకరించని చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులు చంద్రబాబుకు రక్షణ కల్పించినా.. మీడియా ముందు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Tags:    
Advertisement

Similar News