రెండు చోట్ల ఓడిన వ్యక్తిని అనుసరించడమా? టీ కాంగ్రెస్‌లో పవన్‌ లొల్లి

మూలుగుతున్న టీ కాంగ్రెస్‌ కనీసం ప్రతిపక్షాల తరపున పెద్దన్న పాత్ర కూడా పోషించలేకపోతుంది. ఎవరికి వారే నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు. తమ పార్టీని ఇతర పార్టీ నేతల వద్ద పెట్టేస్తున్నారు. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అంశం తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలకు కారణమైంది. పవన్ కల్యాణ్‌ అభిమాని అయిన టీ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ ఒకవైపు, మిగిలిన కాంగ్రెస్‌ నేతలు మరో వైపు ఈ అంశంలో నిలబడుతున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తొలుత […]

Advertisement
Update: 2019-09-18 04:23 GMT

మూలుగుతున్న టీ కాంగ్రెస్‌ కనీసం ప్రతిపక్షాల తరపున పెద్దన్న పాత్ర కూడా పోషించలేకపోతుంది. ఎవరికి వారే నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు. తమ పార్టీని ఇతర పార్టీ నేతల వద్ద పెట్టేస్తున్నారు.

ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అంశం తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలకు కారణమైంది. పవన్ కల్యాణ్‌ అభిమాని అయిన టీ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ ఒకవైపు, మిగిలిన కాంగ్రెస్‌ నేతలు మరో వైపు ఈ అంశంలో నిలబడుతున్నారు.

నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తొలుత కాంగ్రెస్‌ గళమెత్తింది. రేవంత్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించి తవ్వకాలు జరిపితే పోరాటం చేస్తామని స్థానికులకు ధైర్యం కూడా చెప్పారు.

అయితే హఠాత్తుగా యురేనియం వ్యతిరేక పోరాటంలోకి వీహెచ్‌… పవన్‌ కల్యాణ్‌ను తీసుకొచ్చారు. పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయి యురేనియంపై పోరాటానికి కలిసిరావాలని కోరారు. అందుకు ఆయన ఓకే అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగాల్సిన సమావేశం కాస్త వీహెచ్‌ కారణంగా పవన్‌ కల్యాణ్ ఆధ్వర్యంలో కార్యక్రమంగా మారిపోయింది.

ఇదే కాంగ్రెస్‌ నేతలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఇటీవల పార్టీ సమావేశంలో పార్టీ నేత సంపత్‌ తీవ్రంగా స్పందించారు. యురేనియం అంశంపై తొలుత పోరాటం మొదలుపెట్టింది కాంగ్రెస్‌ పార్టీ అని…. కానీ కొందరు నేతలు వెళ్లి పవన్‌ కల్యాణ్‌ను కలవడం ఏమిటని వీహెచ్‌ను ఉద్దేశించి విమర్శించారు. పవన్‌ కల్యాణ్ పిలిస్తే కాంగ్రెస్‌ నేతలు వెళ్లి కూర్చోవడం ఏమిటని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ కాంగ్రెస్‌ కంటే గొప్పోడా అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మరికొందరు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో రెండు చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్‌ కల్యాణ్‌ను అనుసరించడం అంటే… కాంగ్రెస్‌ పార్టీ ఎంతో బలహీనపడిపోయిందన్న భావన ప్రజల్లో కలిగించడమే అవుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే తనపై వస్తున్న విమర్శలకు వీహెచ్‌ గట్టిగానే స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ను కలవడాన్ని సమర్ధించుకున్నారు. తానే పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఉద్యమంలోకి ఆహ్వానించానని చెప్పారు. మరోసారి కూడా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు తలపట్టుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News