వరద బాధితులకు.... రూ. 5 వేలు అదనపు సాయం
ఉభయ గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గడచిన పది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఉభయ గోదావరి జిల్లాలను కుదిపేసిన వరద పాలిత ప్రాంతాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ఏరియల్ సర్వే చేశారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి […]
ఉభయ గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గడచిన పది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఉభయ గోదావరి జిల్లాలను కుదిపేసిన వరద పాలిత ప్రాంతాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ఏరియల్ సర్వే చేశారు.
మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి హెలీకాఫ్టర్ లో వరద ప్రాంతాలను సందర్శించారు. అనంతరం రాజమహేంద్రవరంలో అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద బాధితులకు నిత్యావసరాలను అందజేయడంతో పాటు ప్రతీ కుటుంబానికి ఐదు వేల రూపాయల తక్షణ సాయం అందించాలని అదేశించారు ముఖ్యమంత్రి జగన్.
వరదల కారణంగా వందలాది గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి తక్షణమే చేయూతనందించాలని సీఎం జగన్ ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాలలో 70 శాతం గ్రామాలు గిరిజన గ్రామాలేనని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కేవలం ముంపునకు గురైన గ్రామాల్లోనే కాకుండా వర్షాల కారణంగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన అన్ని గ్రామాల ప్రజలకు కూడా నిత్యావసరాలను సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో సాగు చేసిన పంటలు దెబ్బతింటే వారికి పరిహారంతో పాటు విత్తనాలను కూడా ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అధికారులతో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు కురసాల కన్నబాబు, అనీల్ కుమార్ యాదవ్, పినిపె విశ్వరూప్, రంగనాథరాజు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన భరత్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.