గుట్టు తేలుస్తారని ఇద్దరు ఎస్పీలను బదిలీ చేయలేదా బాబు?
తుని రైలు దహనం, అమరావతిలో పంటపొలాల దగ్ధం, పోలవరం కాలువలకు గండ్లు పెట్టడం వంటివన్నీ వైసీపీయే చేయించిందని పోలీసుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించడంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదా? అని ప్రశ్నించారు. నిజంగా ఈ ఘటనల వెనుక వైసీపీ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. అమరావతిలో చెరుకు తోటలను తగలబెట్టింది టీడీపీ వారేనన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన నాటి అర్బన్, […]
తుని రైలు దహనం, అమరావతిలో పంటపొలాల దగ్ధం, పోలవరం కాలువలకు గండ్లు పెట్టడం వంటివన్నీ వైసీపీయే చేయించిందని పోలీసుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించడంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదా? అని ప్రశ్నించారు. నిజంగా ఈ ఘటనల వెనుక వైసీపీ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. అమరావతిలో చెరుకు తోటలను తగలబెట్టింది టీడీపీ వారేనన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన నాటి అర్బన్, రూరల్ ఎస్పీలు… టీడీపీ నేతల లింక్లను వెలికి తీస్తున్న సమయంలోనే వారిద్దరిని బదిలీ చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు వల్లే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయన్నారు. నేషనల్ క్రైం బ్యూరో లెక్కల ప్రకారం దళితులపై దాడుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని గుర్తు చేశారు. ట్రాన్స్పోర్టు కమిషనర్గా ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీస్ బాలసుబ్రమణ్యంపై టీడీపీ ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బొండా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కలిసి దాడి చేస్తే కనీసం కేసు నమోదు చేయలేని దుస్థితిలో చంద్రబాబు పాలన సాగుతోందన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా సీఎం సభలో నినాదాలు చేసినందుకు ముస్లిం యువకులపై దేశద్రోహం కేసుపెట్టింది నిజం కాదా? అని అంబటి ప్రశ్నించారు. వైసీపీ పత్తికొండ ఇన్చార్జ్ నారాయణ రెడ్డిని డిప్యూటీ సీఎం కుమారుడే హత్య చేయిస్తే ఆయనపై కేసు కూడా నమోదు చేయకుండా తప్పించుకుంటే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్పీకర్ కోడెలతో సహా, టీడీపీ ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను ఎత్తివేస్తూ జీవో జారీ చేయలేదా అని అంబటి నిలదీశారు. ఇంత దారుణంగా పాలన సాగిస్తూ తిరిగి ప్రతి సంఘటన వెనుక వైసీపీ హస్తముందని ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.