నాకూ అమ్మా చెల్లీ ఉన్నారు, రావెలపై సోషల్ మీడియాలో పేలుతున్న పంచ్‌లు

మహిళను వేధించిన కేసులో మంత్రి రావెల కిషోర్ కుమారుడు సుశీల్  శనివారం అర్థరాత్రి  బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో  లొంగిపోయారు. దీంతో సుశీల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఒక మంత్రి కుమారుడిపై నిర్భయ కేసు నమోదు కావడం దేశంలో ఇదే తొలిసారి. నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద సుశీల్‌పై కేసు నమోదు చేశారు. మొదట ఐపీసీ సెక్షన్ 509 ఈవ్‌టీజింగ్ కింద కేసు నమోదు చేశారు. […]

Advertisement
Update: 2016-03-05 22:36 GMT

మహిళను వేధించిన కేసులో మంత్రి రావెల కిషోర్ కుమారుడు సుశీల్ శనివారం అర్థరాత్రి బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో సుశీల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఒక మంత్రి కుమారుడిపై నిర్భయ కేసు నమోదు కావడం దేశంలో ఇదే తొలిసారి.

నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 కింద సుశీల్‌పై కేసు నమోదు చేశారు. మొదట ఐపీసీ సెక్షన్ 509 ఈవ్‌టీజింగ్ కింద కేసు నమోదు చేశారు. అయితే మీడియాలో పెద్దెత్తున కథనాలు రావడంతో పోలీసులు దిగి వచ్చారు. అదనంగా నిర్భయ చట్టాన్ని చేర్చారు. మహిళను వేధించిన వారిపై ఈవ్ టీజింగ్ కేసు పెట్టిన పోలీసులు… మంత్రి కుమారుడిని చితకొట్టినందుకు గాను స్థానికులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆశ్చర్యపరిచారు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో నిర్భయ కేసు నమోదు చేయకతప్పలేదు.

అయితే పోలీసుల ముందు లొంగిపోయిన సుశీల్ మాత్రం తనకు ఏ పాపం తెలియదని పాత కథే చెబుతున్నారు. తన తండ్రిని రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేశారని ఆరోపించారు. తనకూ తల్లి చెల్లీ ఉన్నారని చెప్పారు. తాను చదువుకున్న వాడినని ఇలాంటి పనులు చేసే వ్యక్తిని కాదన్నారు. అయితే సుశీల్‌ మాటలకు పొంతన లేకుండా ఉంది. తొలుత ఫేస్‌బుక్‌లో కుక్కపిల్ల స్టోరి అల్లాడు సుశీల్. కుక్కపిల్లను రక్షించేందుకు తాను ప్రయత్నించానని కానీ సదరు మహిళ హఠాత్తుగా తనను తిట్టడం మొదలుపెట్టిందని ఫేస్‌ బుక్‌లో కథ రాశాడు. మహిళ అరుపులు విని వచ్చిన స్థానికులు తనను కొట్టారని చెప్పాడు. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు రావడంతో రావెల కథ అడ్డం తిరిగింది. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అక్కడ కుక్క పిల్లే లేదు. కారు మహిళను వెంబడిస్తున్నట్టు స్పష్టంగా ఉంది. సదరు మహిళ తప్పించుకునేందుకు ఎటు వైపు వెళ్తే కారును కూడా అటువైపు తిప్పుతూ వెంటాడినట్టు సృష్టంగా ఉంది. దీంతో కుక్క పిల్ల కథ అట్టర్ ప్లాప్ అయింది.

సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత సుశీల్‌పై నెటిజన్లు విరుచుకుపడ్డారు.

‘’ఈ కుక్క పిల్ల స్టోరి రచయిత ఎవరు బాబు’’ అంటూ కొందరు… ‘’ఇలాంటి స్టోరి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా వచ్చి ఉండదు’’ అని మరికొందరు సెటైర్లు వేశారు. ‘’ఈ ఘటన ఏపీలో జరిగి ఉంటే కుక్కపిల్లను అరెస్ట్ చేసి నిర్భయ కేసు పెట్టేవారు.. కుక్కను కాపాడేందుకు ప్రయత్నించిన ఈ అమాయకుడిని రక్షించి ఉండేవారు’’ అని ఇలా రకరకాలుగా నెటిజన్లు రావెల సుశీల్ కట్టుకథపై మండిపడ్డారు.

‘’తండ్రి రాజధానిలో అసైన్డ్ భూములు కొంటే తప్పు కానప్పుడు ఇక్కడ కొడుకు మహిళను చేయి లాగితే తప్పేంటి అనుకున్నట్టుగా ఉన్నాడు’’ అని ఒకరు కామెంట్ పెట్టారు. ‘’కాల్‌మనీ కేసులో చర్యలు లేకపోయే సరికి ఏమీ కాదన్న ధైర్యం వచ్చింది కాబోలు’’ అని మరో నెటిజన్ కామెంట్స్ పెట్టారు. నీవు చేసిన తప్పుడు పనికి విశ్వాసం కలిగిన కుక్కను వాడుకోవడం సరికాదు అంటూ మరో నెటిజన్ పోస్టు పెట్టారు. ఇలా రకరకాలుగా రావెలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News