ప్రగతి భవన్ లో కేసీఆర్ సమీక్ష.. కీలక నిర్ణయాలు ఇవే

ఎకరాకు 10వేల నష్ట పరిహారం రైతుల ఖాతాల్లో జమచేయాలన్నారు. స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి జరిగిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు.

Advertisement
Update: 2023-03-28 12:34 GMT

శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 30న భధ్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలు సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా భధ్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.


తెలంగాణలో పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం.. తదితర అంశాలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎకరాకు 10వేల నష్ట పరిహారం రైతుల ఖాతాల్లో జమచేయాలన్నారు. స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి జరిగిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు.

రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరగాలని సూచించారు. ఖాళీ స్థలాలు ఉండి, ఇంటి నిర్మాణానికి డబ్బులు లేని నిరుపేదలకు ప్రభుత్వం తరపున రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించే దిశగా చర్యలు చేపట్టాలని దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. 4 లక్షల ఎకరాలకు గాను 1.55 లక్షలమంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు, పాస్ బుక్కులు ముద్రించి సిద్దంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు సీఎం. 

Tags:    
Advertisement

Similar News