మహబూబ్‌నగర్‌లో దారుణం.. బాలికపై బాబాయ్ మరో ముగ్గురితో కలసి అత్యాచారం, హ‌త్య‌

అయితే బాలిక విషయాన్ని గ్రామంలో చెబుతుందని భయపడిన‌ నిందితులు ఆమె గొంతు పిసికి చంపేశారు. అనంతరం ఓ చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

Advertisement
Update: 2022-12-03 09:00 GMT

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి 9వ తరగతి చదివే విద్యార్థినిపై మరో ముగ్గురితో కలిసి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆమె ఇంట్లో చెబుతుందని భయపడి అందరూ కలిసి బాలిక‌ను హత్య చేశారు. ఆ తర్వాత ఉరి వేసుకుని చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. జిల్లాలోని బాలనగర్ మండల పరిధిలోని గ్రామంలో 9వ తరగతి చదివే బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఒక్కతే ఇంట్లో ఉంటోంది.

వరుసకు బాబాయ్ అయ్యే శ్రీనివాస్ అనే వ్యక్తి బాలికపై కన్నేశాడు. అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అతడికి బాలిక ఇంట్లో ఒంటరిగా క‌నిపించింది. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను మరో ముగ్గురితో కలిసి బలవంతంగా ఊరి బయటకు తీసుకెళ్లాడు. అక్కడ వారంతా బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అయితే బాలిక విషయాన్ని గ్రామంలో చెబుతుందని భయపడిన‌ నిందితులు ఆమె గొంతు పిసికి చంపేశారు. అనంతరం ఓ చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఉదయం ఇంట్లో బాలిక కనిపించకపోయేసరికి బంధువులు ఊరంతా వెతకగా చెట్టుకు ఉరేసుకొని వేలాడుతుండడం కనిపించింది. అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడి ఉరి వేసినట్లు గుర్తించిన గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వరుసకు కూతురు అయ్యే బాలికపై బాబాయ్ అత్యాచారం చేయడమే కాకుండా హతమార్చడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    
Advertisement

Similar News