తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అత్యున్నతమైనది -హోం మంత్రి

శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సక్రమంగా జరిగి రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు.

Advertisement
Update: 2023-05-11 02:22 GMT

తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అత్యున్నతమైనదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం పోలీస్ శాఖ ఆధునీకీకరణకు, పోలీస్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రాధాన్యత దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదని చెప్పారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 281 మంది పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు సేవా పతకాల ప్రదాన కార్యక్రమం బుధవారం రవీంద్రభారతిలో జరిగింది. ఈ పతకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సక్రమంగా జరిగి రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకీకరణ, పెద్ద ఎత్తున నియామకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు.

కొత్త పోలీస్ జోన్లు ఏర్పాటు చేయడం, పోలీస్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటుతోపాటు నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం, ఐ 4 సి ల ఏర్పాటు, అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ టవర్ ను కూడా ప్రారంభించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో మెరుగైన శాంతియుత పరిస్థితులు ఉన్నందునే, అనేక బహుళ జాతి సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ లో ప్రారంభించాయని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, మహిళా భద్రతా విభాగం, షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సీసీ టీవీ ల ఏర్పాటు, మట్కా-గ్యాంబ్లిగ్ కేంద్రాల మూసివేత, మాదక ద్రవ్యాల నివారణ తదితర చర్యలతో తెలంగాణ పోలీస్ దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా నిలిచిందని హోం మంత్రి తెలియజేశారు.

డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఈ పతకాలు కేవలం వ్యక్తిగతం కావని, తమ పరిధిలో పనిచేసే వారందరితోపాటు, కుటుంబ సభ్యులకు వచ్చినట్టుగా భావించాలన్నారు. పోలీస్ శాఖ ఆర్థికాభివృద్ధిలో కీలకమైన ఒక ప్రధాన భాగమని అన్నారు. పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని, నిరంతరం 24/7 ప్రజా సేవలో విధులు నిర్వర్తించే పోలీసులు తాము అందించే ఉత్తమ సేవలకు గుర్తింపుగా సేవా పతకాలను అంద చేయడం జరుగుతుందని, ఈ పతకాల స్ఫూర్తితో మరింత అంకిత భావంతో పనిచేయాలని పోలీసు అధికారులకు పిలుపు నిచ్చారు.

అడిషనల్ డీజీ అభిలాష బిస్త్ ఈ కార్యక్రమానికి స్వాగతం పలకగా, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఏసిబి డీజీ రవిగుప్త, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీలు విజయ కుమార్, షిఖా గోయల్, స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐజి లు కమలహాసన్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీం, రమేష్‌లతోపాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు.

Tags:    
Advertisement

Similar News