మహిళలపై మగ పోలీసుల దాష్టికం... లాఠీలతో తలలు పగలకొట్టారు

అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసన తెలుపుతున్న మహిళలపై ఉత్తరప్రదేశ్ లో పోలీసులు దారుణంగా దాడి చేశారు. మగపోలీసులు విచక్షణారహితంగా చేసిన దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు.

Advertisement
Update: 2022-11-07 11:18 GMT

ఉత్తరప్రదేశ్ లో పోలీసులు మహిళలపై దారుణంగా దాడి చేశారు. మగ పోలీసులు పైపులు, కర్రలు, లాఠీలతో మహిళపై విరుచుకపడ్డారు. కొందరి మహిళల తలలు పగలగా మరి కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్‌ జిల్లా జలాల్‌పూర్‌లోని ఓ ప్రాంతంలో ఈ మధ్యే బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. కొందరు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో నిరసనలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఆదివారం వందలాది మంది మహిళలు బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన చోటే నిరసనకు దిగారు. అది తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు. నిరసన తెలుపుతున్నది మహిళలు అనేది కూడా పట్టించుకోకుండా పురుష పోలీసులు వారిపై విరుచుకపడ్డారు. పోలీసులు మహిళలను కొట్టిన వీడియోలు చూస్తే వారి అతి ప్రవర్తన అర్దమవుతోంది. ఓ మహిళ తలపై పెద్ద కర్రతో ఓ మగ పోలీసు కొట్టగా ఆ మహిళ స్పృహతప్పి పడిపోయింది. అనేక మంది మహిళలు గాయాలపాలయ్యారు. పారిపోతున్న మహిళలను పోలీసులు వెంటపడి మరీ కొట్టారు.

పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేయడంతో మహిళలు కూడా తిరగబడ్డారు. పోలీసులపైకి రాళ్ళు విసిరారు.

అయితే పోలీసులు మహిళలపై దాడి చేశారన్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. మహిళలే తమపై రాళ్ళు రువ్వడంతో తాము స్వల్ప బలాన్ని ఉపయోగించవలసి వచ్చిందని అంబేద్కర్ నగర్ పోలీసు అధికారి అజిత్ కుమార్ సిన్హా అన్నారు.


Tags:    
Advertisement

Similar News