మ‌ర్మాంగాల‌పై దాడి ఘ‌ట‌న‌లో ఐపీఎస్ అధికారిపై వేటు వేసిన‌ త‌మిళ‌నాడు స‌ర్కార్‌

వీడియో వైర‌ల్ కావ‌డంతో ఈ ఘ‌ట‌న‌పై జిల్లా క‌లెక్ట‌ర్ న్యాయ విచార‌ణ‌కు ఆదేశించారు. విచార‌ణ ముగిసే వ‌ర‌కు ఏఎస్పీని విధుల నుంచి స‌స్పెండ్ చేశారు.

Advertisement
Update: 2023-03-30 03:30 GMT

త‌మిళ‌నాడులో ఇటీవ‌ల కాలంలో లాక‌ప్ డెత్స్‌ పెరిగిపోతున్నాయి. దీంతో మాన‌వ హ‌క్కుల సంఘాల వారు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలోనూ ఈ ఘ‌ట‌న‌ల‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏకంగా ఓ ఐపీఎస్ అధికారి ఇటీవ‌ల ఓ కేసు విచార‌ణ‌లో నిందితుడి మ‌ర్మాంగాల‌పై దాడి చేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. సోష‌ల్ మీడియాలో ఈ విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆ అధికారిపై చ‌ర్య‌లు తీసుకుంది. ఈ విష‌యాన్ని అసెంబ్లీ స‌మావేశాల్లో వెల్ల‌డించింది.

త‌మిళ‌నాడులోని తిరున‌ల్వేలి జిల్లా అంబా స‌ముద్రంలో 2020 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బ‌ల్వీర్ సింగ్ అసిస్టెంట్ సూప‌రింటెండెంట్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. ప‌దిరోజుల క్రితం జ‌రిగిన ఓ దాడి కేసులో ఐదుగురు నిందితుల‌ను ఆయ‌న విచార‌ణ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏఎస్పీ త‌మ‌ను తీవ్రంగా వేధించార‌ని వారు ఆరోపించారు. ఏఎస్పీ క‌టింగ్ ప్లేర్‌తో త‌మ ప‌ళ్లు పీకాడ‌ని, ఇటీవ‌లే వివాహ‌మైన ఓ యువ‌కుడిని మ‌ర్మాంగాల‌పై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచాడ‌ని సోష‌ల్ మీడియాలో ఓ వీడియో విడుద‌ల చేశారు. మ‌ర్మాంగాల‌పై దాడికి గురైన వ్య‌క్తి ప‌రిస్థితి ఇప్పుడు విష‌మంగా ఉంద‌ని ఆ వీడియోలో వారు వివ‌రించారు.

ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో ఈ ఘ‌ట‌న‌పై జిల్లా క‌లెక్ట‌ర్ న్యాయ విచార‌ణ‌కు ఆదేశించారు. విచార‌ణ ముగిసే వ‌ర‌కు ఏఎస్పీని విధుల నుంచి స‌స్పెండ్ చేశారు. ప్ర‌జాసంఘాలు, సామాజిక కార్య‌క‌ర్త‌లు మాత్రం ఆ అధికారిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆ ఐపీఎస్ అధికారిపై చ‌ర్యలు తీసుకున్న ప్ర‌భుత్వం ఆ విష‌యాన్ని అసెంబ్లీ స‌మావేశాల్లోనూ ప్ర‌క‌టించింది. త‌మిళ‌నాడులో మాన‌వ‌హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈ సంద‌ర్భంగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ హెచ్చ‌రించారు. మ‌రోప‌క్క ఇటీవ‌ల కాలంలో క‌స్ట‌డీ మ‌ర‌ణాలు పెరుగుతుండ‌టంతో సీసీటీవీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిందితుల విచార‌ణ జ‌ర‌గాల‌ని కోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News