ఇక్కడ రాజాసింగ్.. అక్కడ ఈశ్వరప్ప.. నోటికి ఏదొస్తే అది..

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నాటకలో సావర్కార్ ఫ్లెక్సీలు పెట్టడం వివాదాలకు కారణం అయింది, మరో వర్గం టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీలు పెట్టడానికి ప్రయత్నించింది. దీంతో మొదలైన గొడవ ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది.

Advertisement
Update: 2022-08-25 06:06 GMT

ఇక్కడ హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై నోరు పారేసుకుంటే, అక్కడ కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరప్ప టిప్పు సుల్తాన్ ను ముస్లిం గూండా అనే వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్నాటకలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కొంతమంది ఆయన నాలుక కోస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఆయన పోలీస్ కేసు పెట్టారు

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కర్నాటకలో సావర్కార్ ఫ్లెక్సీలు పెట్టడం వివాదాలకు కారణం అయింది, మరో వర్గం టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీలు పెట్టడానికి ప్రయత్నించింది. దీంతో మొదలైన గొడవ ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కర్నాటక మాజీ మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. టిప్పుసుల్తాన్ ను ఆయన ముస్లిం గూండాగా అభివర్ణించారు. దీంతో ముస్లింలందరూ తిరగబడ్డారు. మధ్యలో మతం పేరు ఎందుకు తెచ్చారంటూ నిలదీశారు. దీనిపై వివరణ ఇచ్చిన ఈశ్వరప్ప.. తాను ముస్లింలు అందర్నీ గూండాలు అనలేదని, కేవలం టిప్పు సుల్తాన్‌ని మాత్రమే అన్నానని చెప్పారు. అలాంటి అతివాద భావాలున్నవారిని కూడా అదే గాటన కట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇక్కడ హైదరాబాద్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో పాతబస్తీ అట్టుడుకుతుంటే.. అక్కడ కర్నాటకలోని శివమొగ్గ ప్రాంతం ఈశ్వరప్ప వ్యాఖ్యలతో తగలబడిపోతోంది. అక్కడ రెండు వర్గాలు రగిలిపోతున్నాయి. నగరంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, గుంపులను చెదరగొట్టేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఈశ్వరప్పపై చర్యలు తీసుకోవాలని మైనార్టీలు ఆందోళనకు దిగుతున్నారు. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందంటూ కర్నాటకలో విపక్షాలు మండిపడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News