కెమికల్స్‌తో పండించిన ఫ్రూట్స్‌ను ఇలా కనిపెట్టొచ్చు!

వేసవికాలంలో మామిడి పండ్లతో పాటు చాలారకాల పండ్లలో ‘రైపెనింగ్ ఏజెంట్స్’ వినియోగ౦ ఎక్కువగా ఉంటుంది. రైపెనింగ్ ఏజెంట్స్ అంటే.. క్యాల్షియం కార్బైడ్, ఇథిలీన్‌ లాంటి రసాయనాలు. వీటిని ఉపయోగించి పండ్లకు కృత్రిమంగా రంగు తెప్పించి పండిస్తుంటారు.

Advertisement
Update: 2024-05-04 08:50 GMT

సమ్మర్‌‌లో ఏ ఫ్రూట్ మార్కెట్‌కి వెళ్లినా పసుపు రంగులో మామిడి పళ్లు నిగనిగలాడుతూ నోరూరిస్తుంటాయి. వాటితోపాటు అరటి, జామ, యాపిల్, బొప్పాయి.. ఇలా రకరకాల పండ్లన్నీ మిలమిలా మెరుస్తూ ఆకట్టుకుంటాయి. అయితే పైకి అలా ఆకర్షణీయంగా కనిపించే పండ్లన్నీ చెట్టుకి మగ్గినవి కాదనీ, కెమికల్స్‌తో పండించినవి అని మీకు తెలుసా? ఇలా కెమికల్స్ తో పండిచినవే పండ్ల తింటే లేనిపోని రోగాలు అంటుకుంటాయి. మరి వీటిని కనిపెట్టేదెలా?

వేసవికాలంలో మామిడి పండ్లతో పాటు చాలారకాల పండ్లలో ‘రైపెనింగ్ ఏజెంట్స్’ వినియోగ౦ ఎక్కువగా ఉంటుంది. రైపెనింగ్ ఏజెంట్స్ అంటే.. క్యాల్షియం కార్బైడ్, ఇథిలీన్‌ లాంటి రసాయనాలు. వీటిని ఉపయోగించి పండ్లకు కృత్రిమంగా రంగు తెప్పించి పండిస్తుంటారు. ఇలాంటి పండ్లను తినడం ద్వారా శరీరంలోకి ఆ రసాయనాలు వెళ్లి అవకాశముంది. ఆర్టిఫీషియల్‌గా పండించిన పండ్లను ఎలా కనిపెట్టొచ్చంటే..

ఇలా కనిపెట్టొచ్చు

పండ్లు కొనే విషయంలో మోసపోకూడదంటే ఏ సీజన్‌లో పండే వాటిని ఆ సీజన్లలోనే కొనాలి. సీజన్‌కు ముందే మార్కెట్‌లోకి వచ్చిన పండ్లను కొనడం అంతమంచిది కాదు. మే చివరి నుంచి జులై వరకు మామిడి పండ్ల అసలైన సీజన్. అప్పుడే మార్కెట్‌లోకి సహజంగా మగ్గిన పండ్లు వస్తాయి. అలా కాకుండా సీజన్ కంటే ముందు వచ్చే వాటిలో చాలా వరకు కృత్రిమంగా పండించినవే..

మామిడి పండ్లు కొన్నాక మంచివా, కల్తీవా అని గుర్తించాలంటే పండ్లను నీళ్లలో వేసి చూడాలి. మామిడి పండు నీళ్లలో మునిగితే ఆ పండు సహజంగా పండినట్టు. ఒకవేళ నీళ్లలో తేలితే కృత్రిమంగా పండించారని అర్థం.

కృత్రిమంగా పండించిన పండ్లన్నీ పసుపు రంగులో క్లీన్‌గా కనిపిస్తాయి. పండ్ల రంగుల్లో ఎలాంటి తేడా క‌నిపించ‌దు. అన్నీ ఒకేలా ఉంటాయి. అదే స‌హ‌జ సిద్ధంగా పండిన‌వైతే రంగుల్లో తేడా ఉంటుంది. అన్ని పండ్లు ఒకే రంగులో ఉండ‌వు. వేరువేరు రంగుల్లో ఉంటాయి.

అర‌టి పండు కాడ గ్రీన్ క‌ల‌ర్‌లో ఉండి పండు ప‌సుపు రంగులో ఉంటే అవి కృత్రిమంగా పండించిన‌దే. స‌హ‌జ సిద్ధంగా పండిన‌వయితే తొడిమ కూడా ప‌సుపు రంగులోనే ఉంటుంది.

స‌హ‌జ సిద్ధంగా పండిన కూర‌గాయ‌లు, పండ్లు ఆక‌ర్షణీయంగా ఉండ‌వు. కానీ కృత్రిమంగా పండిన‌వాటి రంగు మెరుస్తుంటుంది. ఆ రంగును బట్టి గుర్తుపట్టేయొచ్చు.

కృత్రిమంగా పండిన పండ్లు మెత్తగా, మృదువుగా ఉంటాయి. స‌హ‌జ సిద్ధంగా పండినవి కొంచెం గ‌ట్టిగా ఉంటాయి. రంగును చూసి మోసపోకుండా.. కాయను సున్నితంగా నొక్కి తొడిమల దగ్గర మంచి వాసన వస్తుందా అని చూడాలి.

ఇలా క్లీన్ చేయొచ్చు

పండ్లు, కూరగాయల మీద ఉండే రసాయనాలను క్లీన్ చేయడానికి వాటిని గోరు వెచ్చని నీళ్లలో వేసి క‌డ‌గాలి. నీళ్లలో పసుపు లేదా బేకింగ్ సోడా కూడా వేయొచ్చు.

పండ్లు, కూరగాయల మీద చేరిన క్రిములను, బ్యాక్టీరియాను వెనిగర్ కూడా నాశనం చేస్తుంది. ఒక బకెట్‌లో కొద్దిగా నీళ్లు నింపి, అందులో వైట్‌ వెనిగర్‌ ఒక కప్పు వేసుకోవాలి. ఆ నీళ్లలో ఐదు నిముషాలు పండ్లు, కూరగాయలు వేయడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు నాశనం అవుతాయి.

స్ప్రే సీసాలో ఒక చెంచా నిమ్మరసం, రెండు చెంచాల వెనిగర్‌, ఒక కప్పు నీళ్లు కలుపుకొని వెజిటబుల్‌ స్ప్రే తయారుచేసుకోవచ్చు. దీన్ని పండ్లు లేదా కూరగాయల మీద చల్లి రుద్దితే కెమికల్స్ పోతాయి.

పండ్లపై రసాయనాలు పై పొరల్లో పేరుకుని ఉంటాయి. అందుకే మామిడి పళ్ళను తినేముందు వాటి తొక్కను తీసేయడం మంచిది.

Tags:    
Advertisement

Similar News