అంబటిని కవ్విస్తోన్న పవన్ కల్యాణ్..

ఇప్పుడు పవన్ లైన్లోకి వచ్చారు. అంబటిపై కార్టూన్ వేయించారు. ఆయన్ను జనం తరుముకుంటున్నట్టు, అప్పడాల కర్రలు, చీపుర్లు, చెప్పులు ఆయనపై విసిరేస్తున్నట్టు మసాలా దట్టించారు.

Advertisement
Update: 2022-08-04 01:54 GMT

పవన్ కల్యాణ్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చే వైసీపీ నేతల్లో మంత్రి అంబటి రాంబాబు ఒకరు. అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో.. కాస్త స్ట్రాంగ్ డోస్ ఇస్తుంటారు అంబటి. మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత ఆ డోస్ మరింత పెరిగింది. ఇటీవల పవన్ వైరల్ ఫీవర్ అంటూ కాస్త వెనక్కి తగ్గారు. రెండు వారాలుగా ఆయన యాక్టివిటీ తగ్గిపోవడంతో ఆయనపై చేసే విమర్శలు కూడా తగ్గిపోయాయి. తాజాగా జనసేనాని మళ్లీ లైన్లోకి వచ్చారు. ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. ఇప్పటి వరకు సీఎం జగన్ పై జనసేన స్పెషల్ గా కార్టూన్లు వేయించేది. ఫస్ట్ టైమ్ జగన్ కాకుండా ఆ పార్టీ నేతపై కార్టూన్ వేయించారు పవన్ కల్యాణ్. గడప గడప కార్యక్రమంలో అంబటిని జనం తరుముకుంటున్నట్టు సెటైర్ వేశారు.

అనవసరంగా కవ్వించారా..?

గడప గడప కార్యక్రమంలో కావాలనే టీడీపీ, జనసేన నాయకులు రెచ్చిపోయారని, దాన్ని ఎల్లో మీడియా హైలైట్ చేసిందని, అక్కడే ఏమీ జరక్కపోయినా ఏదో జరిగినట్టు కథ అల్లారని అంబటి ఇటీవల మండిపడ్డారు. నా సొంత నియోజకవర్గంలో నాకు బెండు తీస్తారా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఓ సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. ఆ కథ అక్కడితో అయిపోయిందనుకుంటే ఇప్పుడు పవన్ లైన్లోకి వచ్చారు. అంబటిపై కార్టూన్ వేయించారు. ఆయన్ను జనం తరుముకుంటున్నట్టు, అప్పడాల కర్రలు, చీపుర్లు, చెప్పులు ఆయనపై విసిరేస్తున్నట్టు మసాలా దట్టించారు. దాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.

అంబటి ఊరుకుంటారా..?

ఇలాంటి విషయాల్లో అంబటి అస్సలు ఊరుకోరు, అందులోనూ అక్కడ కవ్వించింది పవన్ కల్యాణ్ కాబట్టి రియాక్షన్ కాస్త గట్టిగానే ఉంటుందని అంటున్నారు. మీడియాలో వార్తలొచ్చినందుకే అంబటి బాగా హర్ట్ అయ్యారు. పవన్ ఇలా కార్టూన్ వేయించి మరీ పరువు తీసినందుకు ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మొత్తమ్మీద చాలా రోజుల గ్యాప్ తర్వాత అంబటి, పవన్ పై విరుచుకుపడబోయే సందర్భం అయితే వచ్చింది. పవన్ కూడా అన్నిటికీ సిద్ధమై ఇలా కవ్వింపు కార్టూన్లకు దిగారని స్పష్టమవుతోంది.

Tags:    
Advertisement

Similar News