ముందు పార్టీల మనుగడ ఉండాలి- బాబు, పవన్

పార్టీల మనుగడ ఉంటే అప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవచ్చని.. అందుకే ప్రభుత్వంపై పోరాటం విషయంలో కలిసి రావాల్సిందిగా పవన్‌ కల్యాణ్‌ను తాను ఆహ్వానించానని చంద్రబాబు చెప్పారు.

Advertisement
Update: 2022-10-18 13:05 GMT

టీడీపీ- జనసేన అనుకున్నట్టుగానే.. వైసీపీ ఊహించినట్టుగానే పరిణామాలు మారుతున్నాయి. నేటి నుంచి రాజకీయం మారుతుందని పవన్ ప్రకటించిన కాసేపటికే చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌తో విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరూ మీడియా ముందుకొచ్చి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి.

ముందు రాజకీయ పార్టీలు తమ మనుగడను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు మీడియా ముఖంగా చెప్పారు. పార్టీల మనుగడ ఉంటే అప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవచ్చని.. అందుకే ప్రభుత్వంపై పోరాటం విషయంలో కలిసి రావాల్సిందిగా పవన్‌ కల్యాణ్‌ను తాను ఆహ్వానించానని చంద్రబాబు చెప్పారు. ముందు కలిసి పోరాటం చేస్తే ఎన్నికల్లో ఎవరు ఎలా పోటీ చేయాలన్నది అప్పుడు ఆలోచించుకోవచ్చన్నారు. పవన్‌ కల్యాణ్‌ విశాఖలో పర్యటిస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు.

తాను హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వస్తున్న సమయంలో పవన్‌ కల్యాణ్ ఇక్కడే హోటల్‌లో ఉన్నారని తెలిసిందని.. దాంతో హఠాత్తుగా తాను వచ్చానని.. ముందుగా ఎవరికి సమాచారం ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. పవన్‌ కల్యాణ్ కూడా చంద్రబాబు చెప్పినట్టుగానే.. ప్రజాస్వామ్యం బతకాలంటే ముందు రాజకీయ పార్టీలు బతకాలని వ్యాఖ్యానించారు. పార్టీలు ఉంటే ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేయవచ్చని.. కాబట్టి సీపీఐ, సీపీఎం, బీజేపీ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అవసరమైన మరోసారి చంద్రబాబుతో మాట్లాడుతామని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News