మేమేమైనా చిన్న పిల్లలమా ?.. బయటి వారి అజమాయిషీ లేదు

విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి వచ్చి ఇక్కడెందుకు పెత్తనం చేస్తారని మంత్రి ప్రశ్నించారు. ఇతరుల వచ్చి తమపై పెత్తనం చెలాయించడానికి తాము ఏమైనా చిన్నపిల్లలమా అని బొత్స ఫైర్ అయ్యారు.

Advertisement
Update: 2022-12-25 04:03 GMT

విజయనగరం పర్యటనలో తనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసిన ఒక్క మంచి పనినైనా చూపించగలరా అని ప్రశ్నించారు. విజయనగరం వచ్చి చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పి వెళ్లారని.. సైకోలంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ చంద్రబాబు నానాటికి దిగజారిపోతున్నారని బొత్స విమర్శించారు.

ఉత్తరాంధ్రపై బయటివారి పెత్తనం లేకుండా బొత్స, ధర్మాన అడ్డుకోవాలని.. జగన్‌ కాళ్ల వద్ద ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంపై స్పందించిన మంత్రి బొత్స.. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావ్ ఎలాగైతే మంత్రులుగా చేశారో తాము అలాగే చేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర మంత్రులకు ఉన్న అధికారాలేంటి..? ఇప్పుడు తమకు లేనివేంటి అని బొత్స ప్రశ్నించారు.

బయటి ప్రాంతాలకు చెందిన విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి వచ్చి ఉత్తరాంధ్రపై పెత్తనం చేస్తుంటే బొత్స ఏం చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రశ్నించడాన్ని మంత్రి తప్పుపట్టారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి వచ్చి ఇక్కడెందుకు పెత్తనం చేస్తారని మంత్రి ప్రశ్నించారు. ఇతరుల వచ్చి తమపై పెత్తనం చెలాయించడానికి తాము ఏమైనా చిన్నపిల్లలమా అని బొత్స ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏం దోచుకున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.

ఉత్తరాంధ్ర తులసి వనంలో బొత్స సోదరులు గంజాయి మొక్కలు అంటూ చంద్రబాబు మాట్లాడడాన్ని తప్పుపట్టిన బొత్స.. తాను గానీ, తన కుటుంబసభ్యులు గానీ ఎక్కడ దోచుకున్నామో చంద్రబాబు చూపించాలన్నారు.

Tags:    
Advertisement

Similar News