ఆయనది నారా గళం.. ఈయనది వోడాఫోన్ యాడ్..

లోకేష్ పాదయాత్ర.. డిక్కీ బలిసిన కోడి చికిన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టడం లాగా ఉంటుందన్నారు మంత్రి రోజా.

Advertisement
Update: 2022-12-28 18:08 GMT

పవన్ కల్యాణ్, నారా లోకేష్ పేర్లు వింటేనే విమర్శలతో విరుచుకుపడే మంత్రి రోజా.. మరోసారి ఇద్దరిపై సెటైర్లు ఎక్కుపెట్టారు. పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షో లో పాల్గొనడంపై పై పంచ్ లు వేశారు. అటు నారా లోకేష్ యువగళం యాత్రపై కూడా ఆమె చెణుకులు విసిరారు. ఇద్దరిపని అయిపోయిందని, వారితో ఎవరికీ ప్రయోజనం లేదన్నారు.

అది నారా గళం..

లోకేష్ చేపట్టిన యాత్రపేరు యువగళం అంటూ టీడీపీ టీజర్ వదిలింది. అది యువగళం కాదు నారా గళం అంటూ మంత్రి రోజా అప్పుడే విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ యాత్రతో లోకేష్ ఏం సాధిస్తాడన్నారు. కరోనా సమయంలో తండ్రీ కొడుకులు హైదరాబాద్ లో దాక్కున్నారని, రాష్ట్రాన్ని అప్పలుపాలు చేసి తమకు అప్పగించారని ఆరోపించారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలు రెండూ అట్టర్ ఫ్లాప్ కావడంతో లోకేష్ తో పాదయాత్ర చేయిస్తున్నారని చెప్పారు. లోకేష్ పాదయాత్ర.. డిక్కీ బలిసిన కోడి చికిన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టడం లాగా ఉంటుందన్నారు.

వోడాఫోన్ యాడ్ లాగా..

పవన్‌ ని చూస్తే వోడాఫోన్ యాడ్ గుర్తుకొస్తోందని అన్నారు మంత్రి రోజా. చంద్రబాబు ఎక్కడుంటే పవన్ అక్కడుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎప్పుడూ ఏ షోకి వెళ్లని పవన్.. ఇప్పుడు బాలయ్య షోకి ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. గతంలో పవన్ అభిమానుల్ని బాలయ్య దారుణంగా కించపరిచారని, కానీ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆయన షో కి వెళ్లి ఆయనతో సరదాగా గడిపారని, పవన్ కి పౌరుషం లేదా అని ప్రశ్నించారు. ప్యాకేజీ వస్తే పవన్ ఏ పని అయినా చేస్తారని, బాలయ్య షోకి కూడా అందుకే వెళ్లారని అన్నారు.

కోడిగుడ్డుపై ఈకలు..

ఏపీలో పెన్షన్ల రద్దు అంటూ ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయని మండిపడ్డారు రోజా. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పెన్షన్ ఆగిపోదని, అందరికీ వస్తుందన్నారు. అర్హత లేనివారికే పెన్షన్ ఆగిపోతుందన్నారామె. పెన్షన్ల రద్దు అంటూ ప్రతిపక్షాలు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నాయంటూ దుయ్యబట్టారు.

Tags:    
Advertisement

Similar News