సభలో రోజా.. ప్రెస్ మీట్లో నాని.. చివరి రోజు సెటైర్ల వర్షం..

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు.. టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు వైసీపీ నేతలు. అసెంబ్లీని రద్దు చేసి, అమరావతి రెఫరెండంతో ఎన్నికలకు వెళ్దామంటూ చంద్రబాబు విసిరిన సవాల్ ని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే రోజా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలిచేస్తామంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. ఇటువైపు సీఎం జగన్ సింగిల్ గా వస్తారని, అటువైపు మూతిమీద మీసమున్నవారెవరైనా సింగిల్ గా రావాలంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తామని […]

Advertisement
Update: 2022-03-25 08:54 GMT

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు.. టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు వైసీపీ నేతలు. అసెంబ్లీని రద్దు చేసి, అమరావతి రెఫరెండంతో ఎన్నికలకు వెళ్దామంటూ చంద్రబాబు విసిరిన సవాల్ ని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే రోజా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలిచేస్తామంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. ఇటువైపు సీఎం జగన్ సింగిల్ గా వస్తారని, అటువైపు మూతిమీద మీసమున్నవారెవరైనా సింగిల్ గా రావాలంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తామని ఒకరు, ఎన్నికలు పెడితే గెలిచేస్తామని మరొకరు రెచ్చిపోతున్నారని సెటైర్లు వేశారు రోజా.

అఖండ.. పప్పుండ..
టీడీపీ వైపు బాలయ్య అనే అఖండ ఉన్నారని, ఆయన బావ చంద్రబాబు అనకొండ అని, బాలయ్య అల్లుడు లోకేష్ పప్పుండ అంటూ ఎద్దేవా చేశారు రోజా. అఖండ, అనకొండ, పప్పుండ అందరూ కలసి వచ్చినా గుండ గుండ చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పారు. 14ఏళ్లు ముఖ్యంత్రిగా ఉన్న చంద్రబాబుకి అమ్మఒడి లాంటి పథకం గురించి ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు రోజా. అమ్మఒడి పథకం వల్ల ఆరున్నర లక్షలమంది అదనంగా బడుల్లో చేరుతున్నారని చెప్పారు. ఇది కదా ప్రభుత్వం, ఇదికదా నాయకత్వం అని జగన్ ని కొనియాడారు. జగన్ వయసులో చిన్న అయినా.. ఆలోచనలో ఆకాశమంత ఎత్తుకి ఎదిగారని అన్నారు రోజా. వైసీపీ పథకాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు.

కొడాలి చాకిరేవు..
సభ వెలుపల ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు, లోకేష్ కి చాకిరేవు పెట్టారు మంత్రి కొడాలి నాని. జగన్ టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదంటూ లోకేష్ అంటున్నారని, లోకేష్ అమెరికాలో చదివి మంగళగిరిలో ఓడిపోయారంటూ ఎద్దేవా చేశారు నాని. నాలుగు సార్లు టెన్త్ ఫెయిలై ఎమ్మెల్యేగా ఎన్నికైన తనపై లోకేష్ పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. టీడీపీ కోరిక మేరకు జగన్, విశాఖ నుంచి పాలన నిర్వహించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తారని, ప్రజల తీర్పు కోరతారని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేల బలంతో సీఎంగా ఎన్నికైన జగన్ ని విమర్శించే అర్హత మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ కి లేదన్నారు నాని. టీడీపీ జాతీయ పార్టీ అని నిరూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానన్నారు. టీడీపీ జాతీయ పార్టీ అని, చంద్రబాబు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడని, లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి అని, ఆయన తండ్రి ఓ విజనరీ అని.. ఎవరికి వారే బిరుదులిచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ దగ్గ పార్టీ లాగేసుకుని, చివరకు పార్టీని సర్వనాశనం చేశారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు నాని.

ఒక వ్యవస్థ పరిధిలోకి మరో వ్యవస్థ దూరితే నష్టం ఏర్పడుతుందని అన్నారు నాని. శాసన సభకు చట్టం చేసే హక్కు ఉందని, తామెక్కడా న్యాయ వ్యవస్థను కించపరచలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో 15 రోజులుగా చంద్రబాబుపై జగన్ ఒక్క మాట కూడా తూలలేదన్నారు నాని. చంద్రబాబుని గారు అనే జగన్ సంబోధిస్తారని, కానీ సీఎం జగన్ ని మాత్రం లోకేష్ చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు నాని.

Tags:    
Advertisement

Similar News