న్యాయమూర్తులు కూడా చట్టాలకు అతీతులు కారు " విజయసాయిరెడ్డి

అమరావతి భూముల కుంభకోణంపై సీఐడీ విచారణ, దర్యాప్తు.. ప్రక్రియను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ, అవినీతి నిరోధక చట్టం స్పూర్తిని ఉల్లంఘించాయని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. అమరావతి భూములు, ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తుకి డిమాండ్‌ చేస్తూ వైసీపీ ఎంపీలు ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌లో ధర్నా నిర్వహించారు. అమరావతి భూముల కుంభకోణం కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను ప్రచురించకుండా […]

Advertisement
Update: 2020-09-18 11:04 GMT

అమరావతి భూముల కుంభకోణంపై సీఐడీ విచారణ, దర్యాప్తు.. ప్రక్రియను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ, అవినీతి నిరోధక చట్టం స్పూర్తిని ఉల్లంఘించాయని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.

అమరావతి భూములు, ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తుకి డిమాండ్‌ చేస్తూ వైసీపీ ఎంపీలు ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌లో ధర్నా నిర్వహించారు. అమరావతి భూముల కుంభకోణం కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను ప్రచురించకుండా మీడియా, సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తాయని అన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 పౌరుల ప్రాధమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షిస్తుందని, మీడియా గొంతు నొక్కుతూ హైకోర్టు ఈ కేసులో జారీ చేసిన ఉత్తర్వులు ఆర్టికల్‌ 19 ద్వారా లభించిన వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కాలరాసేదిగా ఉందని అన్నారు.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 19, క్లాజ్‌ 3, సబ్‌ క్లాజ్ సి.. అవినీతి కేసులో కోర్టు ఇష్టానుసారంగా స్టే జారీ చేసే అధికారాలను పరిమితం చేస్తుందని తెలిపారు. చట్టంలో అంత స్పష్టంగా ఉన్నప్పుడు న్యాయమూర్తి ఎలా స్టే ఇస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందని అన్నారు విజయసాయిరెడ్డి.

వ్యక్తుల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశాలు ఉన్నప్పుడో లేదా వ్యక్తుల ప్రైవసీపై దాడికి గురయ్యే పరిస్థితులలోనో, లేదా విచారణ, దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేందుకో.. కేసుకు సంబంధించిన వివరాలు బహిర్గతం కాకుండా మీడియాకు ఇంజెంక్షన్‌ ఆర్డర్ ఇస్తారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

అయితే అమరావతి భూముల కుంభకోణం కేసులో ఇలాంటి పరిస్థితులు ఏమీ లేనప్పుడు మీడియాపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా న్యాయ సూత్రాలు, వాస్తవాల పట్ల గౌరవం చూపనట్లుగా కనిపిస్తున్నాయని అన్నారు.

భవిష్యత్తులో అవినీతి, అక్రమాలపై ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించి కేసు నమోదు చేస్తే నిందితులు కోర్టు స్టే ద్వారా విచారణను నిలిపివేసేందుకు వీలుకల్పించేలా ఏపీ హైకోర్టు ఉత్తర్వులు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ ఉత్తర్వులు చదివిన ఎవరికైనా హైకోర్టు నిందితులకు ఏ రకంగా అండగా నిలబడిందో సులభంగా అర్థంమవుతుందని అన్నారు. జ్యుడీషియల్ ఓవర్‌ రీచ్‌ అనే అంశంలో న్యాయ శాస్త్ర విద్యార్ధులకు ఇదో ల్యాండ్‌ మార్క్‌ కేసు అవుతుందని అన్నారు.

అమరావతి భూముల కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించలేరేమోనని హైకోర్టుకు అనుమానం ఉంటే, నిరభ్యంతరంగా ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించవచ్చని, తాము అందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు విజయసాయిరెడ్డి.

కుంభకోణాన్ని వెలికితీయడం, నిందితులను చట్టం ముందు నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పారు. దేశంలో ఆమోదం పొందే ప్రతి చట్టం రాజ్యాంగానికి అనుగుణంగానే రూపొందుతుందని, ఆ చట్టాలను తు.చ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉంటుందని చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించలేరు, న్యాయమూర్తులు కూడా దీనికి మినహాయింపు కాదు అని ఆయన గుర్తు చేశారు.

Advertisement

Similar News