గంగిరెద్దుల్లా రావడం కాదు.... " బాబు కలిసిన పార్టీలపై జగన్ ఫైర్
రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వెళ్లి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి తిరుగుతున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవలే కొత్తగా కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు పెళ్లి చేసుకుని మోడీపై యుద్దం అంటూ వ్యాఖ్యానిస్తున్నారని… ఇదే చంద్రబాబు 2014కు ముందు కాంగ్రెస్ దేశానికి హాని అని చెప్పి…. ఇప్పుడేమో కాంగ్రెస్ వల్లే దేశానికి రక్షణ అంటున్నారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ అవినీతి కొండ అని చెప్పి…. ఇప్పుడు కాంగ్రెస్ ఆనంద కొండ అంటున్నారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల […]
రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వెళ్లి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి తిరుగుతున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవలే కొత్తగా కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు పెళ్లి చేసుకుని మోడీపై యుద్దం అంటూ వ్యాఖ్యానిస్తున్నారని… ఇదే చంద్రబాబు 2014కు ముందు కాంగ్రెస్ దేశానికి హాని అని చెప్పి…. ఇప్పుడేమో కాంగ్రెస్ వల్లే దేశానికి రక్షణ అంటున్నారని గుర్తు చేశారు.
గతంలో కాంగ్రెస్ అవినీతి కొండ అని చెప్పి…. ఇప్పుడు కాంగ్రెస్ ఆనంద కొండ అంటున్నారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ మొద్దబ్బాయి అన్నారని…. ఇప్పుడు మాత్రం రాహుల్ మేధావి అని చంద్రబాబు అంటున్నారని విమర్శించారు.
2014లో జగన్కు ఓటేస్తే కాంగ్రెస్కు వేసినట్టే అని చెప్పిన చంద్రబాబు…. ఇప్పుడు జగన్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్తో ఉన్న పార్టీలను కలిసి… ఇప్పుడు తానే వారందరినీ ఏకం చేస్తున్నట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పిలిస్తే ధర్మపోరాట దీక్షకు గంగిరెద్దుల్లా వస్తున్నామంటున్న జాతీయ పార్టీల నేతలు…. ముందు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేయడం ధర్మమో కాదో చెప్పాలన్నారు. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ఎలాంటి ధర్మమో చెప్పాలన్నారు. ఇలాంటి పనులను చేస్తున్న చంద్రబాబు ధర్మపోరాట దీక్ష అంటే సిగ్గులేకుండా ఏపీకి ఎలా వస్తున్నారని జాతీయ పార్టీలను ప్రశ్నించారు.
ప్రత్యేక విమానాలేసుకుని అన్ని రాష్ట్రాలకు వెళ్లి ముఖ్యమంత్రులను కలుస్తూ రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు… పక్కనే ఉన్న ఒడిషాకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఝంజావతి ప్రాజెక్టు గురించి మాత్రం మాట్లాడే సమయం లేదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఝంజావతి పూర్తి అయి ఉంటే 25 వేల ఎకరాలకు నీరు వచ్చేదన్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన జగన్… చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి చెరుకు రైతుల బతుకులను నాశనం చేశారని మండిపడ్డారు. పార్వతీపురంలో ఇళ్లకు నీరు మూడు రోజుల ఒకసారి మాత్రమే వస్తున్నాయన్నారు.
పార్వతీపురంలో అభివృద్ధి కనిపించకపోయినా టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాత్రం బాగా సంపాదించుకుంటున్నారని ఇక్కడి ప్రజలే చెబుతున్నారన్నారు జగన్. అంగన్వాడీ పోస్టులను కూడా అమ్ముకుంటున్నారని జగన్ విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు, లోకేష్ దోచేస్తున్నారన్నారు. అత్యంత విలువైన హాయ్లాండ్ భూములు అగ్రిగోల్డ్ సంస్థకు చెందినవి కావంటూ కొత్తగా నాటకం మొదలుపెట్టారన్నారు.
హాయ్లాండ్ తనది అని వచ్చిన ఆలూరి వెంకటేశ్వర రావును ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రశ్నిస్తే…. అతడు నిందితుడు కాదు అంటూ స్వయంగా సీఐడీ చేతే చంద్రబాబు చెప్పించారని జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
రెయిన్ గన్లు ఎక్కడికి పోయాయి? నీ పట్టిసీమ నీళ్లు ఎక్కడికి పోయాయి? అని జగన్ నిలదీశారు. పునాది గోడ కట్టి పోలవరం పూర్తయినట్టు షో చేస్తున్నారని… ప్రతి సోమవారం పోలవరం అంటూ మంత్రులను వెంటేసుకుని వెళ్తున్నారని జగన్ మండిపడ్డారు. పోలవరం సబ్ కాంట్రక్టులు మొత్తం టీడీపీ నేతలకు కట్టబెట్టారన్నారు. యనమల రామకృష్ణుడి వియ్యంకుడే పోలవరం సబ్ కాంట్రాక్టుగా పనిచేస్తున్నారన్నారు.
మరో మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండడంతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంటూ కొత్తగా బయలుదేరారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లు సీఎంగా అనుభవం ఉందని… అమరావతిని బ్రహ్మాండంగా కడతానంటూ ఎన్నికలకు ముందు గ్రాఫిక్స్ బొమ్మలు చూపించిన చంద్రబాబు ఇప్పటికీ అవే బొమ్మలను చూపిస్తున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రే పెద్ద దళారిగా అవతారం ఎత్తడం వల్ల దళారుల నుంచి రైతులను కాపాడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.