ఆ జిల్లాల్లో కుల రాజకీయం అసహ్యమేస్తోంది...

ఆంధ్రప్రదేశ్‌లో సమాజాన్ని చంద్రబాబు నిట్టనిలువునా చీల్చారని కాంగ్రెస్‌ శాసనమండలిపక్ష నేత సి. రామచంద్రయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కుల రాజకీయం ఎక్కువైపోయిందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్లి కుల రాజకీయాలు చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. అధికారంలో ఉన్న సామాజికవర్గం మరింత దూకుడుగా ఉంటోందన్నారు. దీని ప్రభావం మిగిలిన సామాజికవర్గాలపై పడుతోందన్నారు. సదరు సామాజికవర్గంలోని అందరినీ తాను అనడం లేదని కొందరి పనుల వల్ల మొత్తానికే చెడ్డపేరు వస్తోందన్నారు. చంద్రబాబు వారిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజాన్ని ఇలా […]

Advertisement
Update: 2016-09-11 23:10 GMT

ఆంధ్రప్రదేశ్‌లో సమాజాన్ని చంద్రబాబు నిట్టనిలువునా చీల్చారని కాంగ్రెస్‌ శాసనమండలిపక్ష నేత సి. రామచంద్రయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కుల రాజకీయం ఎక్కువైపోయిందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్లి కుల రాజకీయాలు చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. అధికారంలో ఉన్న సామాజికవర్గం మరింత దూకుడుగా ఉంటోందన్నారు. దీని ప్రభావం మిగిలిన సామాజికవర్గాలపై పడుతోందన్నారు. సదరు సామాజికవర్గంలోని అందరినీ తాను అనడం లేదని కొందరి పనుల వల్ల మొత్తానికే చెడ్డపేరు వస్తోందన్నారు. చంద్రబాబు వారిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజాన్ని ఇలా చీల్చడం క్షమించరాని తప్పు అన్నారు.

సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన రామచంద్రయ్య… అలిపిరి ఘటన తర్వాత సానుభూతి ఉందన్న ఉద్దేశంతో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారని కానీ ఆ సానుభూతి లేదన్న విషయం తమకు ముందే తెలుసన్నారు. ఒక ముఖ్యమంత్రి దాడికి గురై తిరుపతి ఆస్పత్రిలో ఉంటే అక్కడికి జనం అస్సలు రాకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ విషయాన్ని నాగం జనార్దన్‌ రెడ్డి, తాను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గ్రాఫ్ బాగా పడిపోయిందన్నారు. జగన్‌పై వ్యక్తిగతంగా చెడు ప్రచారం చేసినా అతడిని ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు వదిలిపెట్టలేదని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. టీడీపీ, బీజేపీ రాజకీయం వల్ల ఆ ఓటు బ్యాంకు ఇప్పుడు మరింత సంఘటితమైందన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు రాజకీయానికి ”పాపం జగన్‌ కూడా ఏం చేయగలరు?” అని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. కడప జిల్లాలో రెండున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా వేయలేదని అన్నారు.

హంద్రీనీవా, గాలేరు- నగరికి వైఎస్‌ ఏడు వేల కోట్లు ఖర్చుపెడితే చంద్రబాబు 13 కోట్లు ఖర్చుపెట్టి రాయలసీమలో కరువు లేకుండా చేస్తానంటే ఎలా నమ్మాలన్నారు. చంద్రబాబు పాలన మొత్తం హైప్‌ అని ఎద్దేవా చేశారు. గతంలో గోదావరి పుష్కరాలను ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ జవహర్‌ రెడ్డి ఒక్కరే సమర్థవంతంగా నిర్వహించారు… ఈసారి చంద్రబాబు వెళ్లి 30 మంది చావుకు కారణమయ్యాడని అన్నారు. అధికారులను తన పని తాము చేసుకుపోయే పరిస్థితిని కల్పించాలన్నారు. అవినీతిలో నెంబర్ వన్‌ అని తేలిన తర్వాత రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడుతారని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి కుటుంబం ఫైవ్ స్టార్ హోటల్‌లో కాపురం పెట్టిన ఉదంతం ఎక్కడా లేదన్నారు. చంద్రబాబుకు కాపులు పూర్తిగా దూరమైపోయారన్నారు. హైదరాబాద్‌లో ఇంకా పదేళ్లు ఉండేందుకు హక్కు ఉండగానే… బాత్‌ రూమ్‌లు కూడా లేని చోటికి ఉద్యోగులను బలవంతంగా ఎందుకు తరలించాల్సి వచ్చిందని రామచంద్రయ్య ప్రశ్నించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని…జాతీయపార్టీ అయిన కాంగ్రెస్‌తోనే ఉంటానన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవాల్సింది ప్రజలేనన్నారు. పరిస్థితులు రాజకీయ పార్టీల చేతుల్లో కూడా లేకుండాపోయాయన్నారు.

Click on Image to Read:

 

 

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News