నిత్యావసరాల ధరలపై గళమెత్తిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటూ… దీనికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనలకు ఆంధ్రప్రదేశ్‌లో మంచి స్పందన లభిస్తోంది. విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండు చేస్తూ ప్రకాశం జిల్లా గిద్దలూరులో తాహసిల్దార్‌ కార్యాలయాన్ని పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు ధర్నా చేస్తూ నిరసన తెలిపారు. చిత్తూరు, కడప జిల్లాల్లో కూడా ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక […]

Advertisement
Update: 2015-11-02 02:30 GMT

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటూ… దీనికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనలకు ఆంధ్రప్రదేశ్‌లో మంచి స్పందన లభిస్తోంది. విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండు చేస్తూ ప్రకాశం జిల్లా గిద్దలూరులో తాహసిల్దార్‌ కార్యాలయాన్ని పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు ధర్నా చేస్తూ నిరసన తెలిపారు. చిత్తూరు, కడప జిల్లాల్లో కూడా ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యేల సారధ్యంలో ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు కార్యకర్తలతో వెళ్ళి తాహసిల్దారు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. పేదలు బతకడానికే కష్టమైపోతున్నందున వెంటనే పెరిగిన ధరలను అదుపు చేయాలని ఆ వినతి పత్రంలో ఆయన కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి వల్లే రాష్ట్రంలో, దేశంలో నిత్యావసరాల ధరలు నింగిని తాకుతున్నాయని, వీటిని వెంటనే అదుపు చేయాలన్న డిమాండుతో తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్ధసారధి తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జెడ్పీటీసీ సభ్యులు మొదలుకొని సర్పంచ్‌ల వరకు, పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు ధర్నాల్లో పాల్గొన్నారని చెప్పారు. ప్రభుత్వం ఇకనైనా ధరల నియంత్రణపై దృష్టి సారించాలని, లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి గోదాముల్లో అక్రమంగా నిల్వలు ఉన్న నిత్యావసరాలను బహిర్గతం చేసి ధరలను అదుపులోకి తేవాలని ఆయన డిమాండు చేశారు. పెరిగిన ధరలతో రోజులు గడిచేదెలాగో అర్థంగాక సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారని, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.

Tags:    
Advertisement

Similar News