కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ‌ ... మున్సిపల్ కమీషనర్‌పై కేటీఆర్ ఆగ్రహం

మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉండాలి తప్ప ఇబ్బందులు రావద్దన్న కేటీఆర్ అందుకు తగ్గట్టు ప్రణాళిక ఉండాలన్నారు. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్‌పై ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చజెప్పాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు.

Advertisement
Update: 2023-01-05 10:23 GMT

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కామారెడ్డి మున్సిపల్ కమీషనర్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్ లోనే ఉందని, దాంట్లో అనేక మార్పులు చేర్పులుంటాయన్న విషయం ప్రజలకు ఎందుకు నచ్చజెప్పలేకపోతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉండాలి తప్ప ఇబ్బందులు రావద్దన్న కేటీఆర్ అందుకు తగ్గట్టు ప్రణాళిక ఉండాలన్నారు. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్‌పై ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చజెప్పాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు.

కాగా కామా రెడ్డి మాస్టర్ ప్లాన్ వల్ల తాము నష్టపోతున్నామంటు కొద్ది రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పరిధిలోకి ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల‌ పరిధిలోని ఎనిమిది గ్రామాలను చేర్చారు.ఈ గ్రామాల్లోని రైతుల నుండి భూములను సేకరించి ఇండస్ట్రీయల్ కారిడార్ కు కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు.. తన భూమి పోతోందనే భయంతో రాములు అనే రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు.

మరో వైపు రైతుల భయాందోళనలను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని, రైతులను పక్కదోవ పట్టిస్తోందని, రెచ్చగొడుతోంతుందని బీఆరెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా ఈ సమస్యను పరిష్కరించడంలో, ప్రజలకు నచ్చజెప్పడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ప్రజలు వ్యతిరేకించే పనులేమీ చేయబోమన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నచ్చజెప్పాలని కమిషనర్ ను కోరారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News