కెన్యాలో డ్యామ్‌ కూలి 42 మంది మృతి

పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోవడంతో కొందరు పైకప్పులపై చిక్కుకుపోయారు. చాలా మంది గల్లంతయ్యారు.

Advertisement
Update: 2024-04-29 14:24 GMT

ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డ్యామ్‌ కూలి సుమారు 42 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కెన్యాలో కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరోబీకి ఉత్తరాన నకురు కౌంటీలోని మాయి మహియు పట్టణ సమీపంలోని డ్యామ్‌లో నీటి ఒత్తిడికి కట్ట తెగిపోయింది. నీరు సమీపంలోని గ్రామాలను ముంచెత్తింది. దీంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోగా, రోడ్లు తెగిపోయాయి. ఆ నీరంతా దిగువ గ్రామాల్లోకి పోటెత్తడంతో భారీగా స్థానికులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ 42 మంది మృత దేహాలను అధికారులను గుర్తించారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోవడంతో కొందరు పైకప్పులపై చిక్కుకుపోయారు. చాలా మంది గల్లంతయ్యారు. దీంతో ఇళ్ల శిథిలాల్లో, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదలో మృతదేహాల కోసం స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.

ఎల్ నినో ప్రభావంతో మార్చి 15 నుంచి కెన్యాలో తీవ్ర స్థాయిలో వరదలు సంభవిస్తున్నాయి. వరదల ధాటికి వేలాది మంది ప్రజల జీవనం అస్తవ్యస్థమైంది. భారీ వర్షాలు, వరదలతో కెన్యా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వర్షాలు, వరదల దెబ్బకి మార్చి, ఏప్రిల్ నెలల్లో దాదాపు 120 మందికిపైగా చనిపోయినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. 24 వేలకు పైగా ఇళ్లు నీట మునిగిపోగా.. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. కెన్యాతో పాటూ పక్కనే ఉన్న టాంజానియా, బురుండి, ఉగాండా దేశాల్లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News