బంగ్లాదేశ్ ఎంపీ హత్య వెనుక వలపుల వల !

ఈ హత్యలో హనీ ట్రాప్ ఒక కీలక అంశంగా పరిగణిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను బట్టి ఎంపీని గొంతునులిమి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉంటారని భావిస్తున్నామన్నారు.

Advertisement
Update: 2024-05-24 07:23 GMT

కోల్‌కతాలో హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అజీమ్‌ కేసులోకొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక యువతి సహాయంతో అన్వర్‌ను న్యూటౌన్‌ అపార్ట్‌మెంట్‌కు రప్పించినట్టు పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడే అన్వర్‌ గొంతు నులిమి హత్య చేసిన తర్వాత శరీరాన్ని ముక్కలు చేసినట్లు అధికారులు తెలిపారు. ముక్కలు చేసి అవయవ భాగాలను ప్లాస్టిక్‌ బ్యాగుల్లో పెట్టి కోల్‌కతాలోని వివిధ ప్రదేశాల్లో పడేశారన్నారు.

అన్వర్‌ హత్య కేసులో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు పలు వివరాలు వెల్లడించారు. అమెరికాలో నివసించే అన్వర్ మిత్రుడు ఒకరు అద్దెకు తీసుకున్న టౌన్‌హాల్‌ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన బంగ్లాదేశ్‌ ఎంపీ ఆ తర్వాత తిరిగిరాలేదని గుర్తించామన్నారు. ఈ హత్యలో హనీ ట్రాప్ ఒక కీలక అంశంగా పరిగణిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను బట్టి ఎంపీని గొంతునులిమి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉంటారని భావిస్తున్నామన్నారు. అలాగే శరీరం నుంచి చర్మాన్ని వేరు చేశారని, దుర్వాసన రాకుండా ఉండేందుకు ముక్కలు చేసిన శరీర భాగాలకు పసుపు కలిపి పె ఫ్రిజ్‌లో పెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధరించామని, ఇందుకు అనుగుణంగా కొన్ని ఆధారాలను సేకరించినట్టుగా చెప్పారు.

ఈ కేసులో గురువారం ముంబైకి చెందిన హవల్దార్ అనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీని హత్య చేసి ఆయన మృతదేహాన్ని గుర్తించడానికి వీల్లేకుండా ఛిద్రం చేసినట్లు నిందితుడు అంగీకరించాడని, ఈ ఘటన వెనుక ప్రధాన సూత్రధారి బంగ్లాదేశ్‌ సంతతికి చెందిన అమెరికా పౌరుడు, ఎంపీ పాత స్నేహితుడు అఖ్తరుజమాన్‌ అని బయటపెట్టాడని, అతడి ఆదేశాలతోనే తాను ఈ పనిచేసినట్లు విచారణలో చెప్పాడని సీఐడీ వర్గాలు వెల్లడించాయి.

ఎంపీ అనర్‌ అజీమ్ మే 12న కోల్‌కతా వచ్చారు. నగర శివారులో ఉన్న తన స్నేహితుడి ఇంట్లో బస చేశారు.తరువాతి రోజు పని ఉందని బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఎంపీ కోసం పోలీసుల గాలింపులో భాగంగా న్యూ టౌన్‌హాల్‌కు వెళ్లగా.. అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. సీసీటీవీ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ హత్య విషయాన్ని బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News