రాజీనామా ప్రకటన చేసిన వైసీపీ ఎమ్మెల్యే

వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ రాజీనామా ప్రకటన చేశారు. రాజీనామా పత్రాన్ని జేఏసీ నాయకులకు అందజేశారు.

Advertisement
Update: 2022-10-08 07:13 GMT

అర‌స‌వెల్లికి అమరావతి వాదుల పాదయాత్ర నేపథ్యంలో ఉత్తరాంధ్రలో మూడు రాజధానులకు మద్దతుగా వివిధ సంఘాలు ఏకమవుతున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈనెల 15న విశాఖ వేదికగా `విశాఖ గ‌ర్జ‌న` పేరిట‌ భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సందర్బంగా వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ రాజీనామా ప్రకటన చేశారు. రాజీనామా పత్రాన్ని జేఏసీ నాయకులకు అందజేశారు. సరైన ఫార్మట్‌లో స్పీకర్‌కు కూడా రాజీనామా లేఖ అందజేస్తానన్నారు. అచ్చెన్నాయుడి నుంచి కూడా జేఏసీ నేతలు రాజీనామా తీసుకోవాలని ధర్మశ్రీ సూచించారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు పోటీ చేస్తామని.. ప్రజలే అమరావతి కావాలో.. మూడు రాజధానులు కావాలో తేలుస్తారని సవాల్ చేశారు. రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్‌ లజపతిరాయ్‌కి అందజేశారు.

విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వారిని రాజకీయాల నుంచి బహిష్కరించే పరిస్థితిని ప్రజలు తీసుకురావాలన్నారు. విద్యార్థులను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని, అందుకోసం విద్యార్థి సంఘాలతో చర్చలు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. జేఏసీ కార్యక్రమాల కోసం మండల, గ్రామ స్థాయిల్లో కూడా కమిటీని వేయాలని నిర్ణయించారు.

Tags:    
Advertisement

Similar News