స్వామిగారి వికృతాలు!

బాలిక ఫిర్యాదుతో పొక్సో యాక్ట్ కింద దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. జ్ఞానానంద ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో లైంగిక దాడి ఆరోపణలకు తగిన ఆధారాలు లభించడంతో పూర్ణానంద సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
Update: 2023-06-20 06:20 GMT

కాషాయ దుస్తులు.. దైవ నామ స్మరణ.. ఆధ్యాత్మిక బోధన ఇవన్నీ పైకి కనిపించేవే. విశాఖ జిల్లా వెంకోజి పాలెంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతి స్వామీ చూడ్డానికి పెద్దమనిషే. కానీ చేసేవన్నీ వికృత చేష్టలే. ఆశ్రమంలో బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న పూర్ణానంద సరస్వతి బాగోతం బయటపడింది. ఆశ్రమంలో ఉంటున్న రాజమహేంద్రవరానికి చెందిన బాలిక (15) స్వామివారి కీచకపర్వాన్ని బయటపెట్టింది.

చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో బాలికను చేరదీసిన బంధువులు ఐదో తరగతి వరకు చదివించారు. తరువాత జ్ఞానానంద ఆశ్రమంలో చేర్చారు. కన్నతండ్రిలా కాపాడాల్సిన స్వామీజీ బాలికపై కన్నేశాడు. రెండేళ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చివరకు పనిమనిషి సాయంతో స్వామీజీ చెర నుంచి బయటపడ్డ బాలిక అమరావతిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుతో పొక్సో యాక్ట్ కింద దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. జ్ఞానానంద ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో లైంగిక దాడి ఆరోపణలకు తగిన ఆధారాలు లభించడంతో పూర్ణానంద సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు.

కాగా.. పూర్ణానంద స్వామీజీ మాత్రం బాలిక ఆరోపణలను కొట్టిపారేశారు. ఆశ్రమ భూములను కాజేయాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేపించారని అన్నారు. తనపై, తన ఆశ్రమంపై కక్ష కట్టి ఇలా చేస్తున్నారని అన్నారు. ఆధ్యాత్మిక సేవ చేస్తుంటే అడ్డుకుంటున్నారని అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News