షూటింగ్ లు మానెయ్, హైదరాబాద్ లో ఆస్తులు అమ్మేసెయ్..

ముఖానికి రంగు వేసుకునే వారిని ప్రజలు నమ్మరని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ముద్రగడ పద్మనాభం.

Advertisement
Update: 2024-04-06 01:49 GMT

పిఠాపురం ప్రజలు పవన్ కల్యాణ్ ని నమ్మాలంటే ఆయన చేయాల్సిన ముఖ్యమైన పనులు మూడు ఉన్నాయని చెప్పారు కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం. పవన్ కల్యాణ్ తమకోసమే పిఠాపురం వచ్చి పోటీచేస్తున్నారని అక్కడి ప్రజలు విశ్వసించాలంటే.. ముందుగా ఆయన సినిమా షూటింగ్ లు ఆపేయాలని చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ తో సంబంధాలు తెంచేసుకోవాలని, అక్కడి ఆస్తులన్నీ పూర్తిగా అమ్మేయాలని, మకాం పిఠాపురంకు మార్చాలని సూచించారు. అలా చేస్తేనే పవన్ ని పిఠాపురం ప్రజలు నమ్మే అవకాశముంటుందన్నారు. ఆ మూడు పనులు చేసిన తర్వాత పవన్ ఇక్కడకు వచ్చి ప్రజా సేవ చేస్తానని చెబితే బాగుంటుందని సెటైర్లు పేల్చారు ముద్రగడ.

నిన్ను నమ్మరు..

ముఖానికి రంగు వేసుకునే వారిని ప్రజలు నమ్మరని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ముద్రగడ పద్మనాభం. ఆ విషయంలో తెలుగు నాట ఎన్టీఆర్ కి మాత్రమే మినహాయింపు ఉందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీఆర్ ని మాత్రమే ప్రజలు విశ్వసించారని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన కాపు నేతలతో ముద్రగడ సమావేశమయ్యారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుకోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారు చర్చించారు.

చంద్రబాబుపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. కొడుకు లోకేష్ కి సీఎం పీఠం కట్టబెట్టడానికే చంద్రబాబు ప్రజాగళం యాత్ర చేస్తున్నారని అన్నారు. కానీ రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయం అని చెప్పారు. సీఎం జగన్‌ మరోసారి అఖండ మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ఏపీలో రామరాజ్య స్థాపన చేస్తారని, మరో 30 ఏళ్లు ఆయనే పాలిస్తారని చెప్పారు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ చేరికతో వైసీపీకి మరింత బలం పెరిగిందని అన్నారు కాపు నాయకులు. బీసీలకు సముచిత స్థానం కల్పించి, పదవులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం సీఎం వైఎస్‌ జగన్‌దేనని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News