పవన్‌కు KA పాల్‌ ఓపెన్‌ ఆఫర్‌

పాస్టర్లకు ఆత్మరక్షణ కోసం రైఫిల్‌ కొనిస్తానని ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ తొత్తులుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలను నమ్మవద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Update: 2024-02-27 04:54 GMT

పవన్‌ కల్యాణ్‌పై ఎప్పటికప్పుడు పంచ్‌లతో సెటైర్లు పేల్చే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కేఏ పాల్‌ మరోసారి పవన్‌ టార్గెట్‌గా సెటైర్లు వేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. పవన్‌కు ఎంత డబ్బు కావాలో చెప్పాలని, ప్రజాశాంతి పార్టీలో చేరితే అతన్ని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన స్పష్టంచేశారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల బరిలో యుద్ధానికి వైసీపీ ‘సిద్ధం’ అంటోందని పాల్‌ చెప్పారు. వైసీపీ చేసిన ‘సిద్ధం’ పిలుపునకు పోటీగా.. టీడీపీ, జనసేన ‘దోచుకోవడానికి సంసిద్ధం’ అంటున్నాయని పాల్‌ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సాక్షిగా చెప్పి మాట తప్పారని పాల్‌ గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ, స్మార్ట్‌ సిటీల నిర్మాణం చేపడతానని చెప్పి మోసం చేశారని విమర్శించారు.

విశాఖపట్నంలోని స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయడానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమయ్యారని పాల్‌ చెప్పారు. మోడీ పాలనలో ఇతర మతాల ప్రజలకు భద్రత లేదని ఆయన స్పష్టం చేశారు. పాస్టర్లకు ఆత్మరక్షణ కోసం రైఫిల్‌ కొనిస్తానని ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ తొత్తులుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలను నమ్మవద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వంగవీటి రంగాను హత్య చేయించిన చంద్రబాబు చెర నుంచి పవన్‌ బయటకు రావాలని కేఏ పాల్‌ సూచించారు.

Tags:    
Advertisement

Similar News