మహోగ్రంగా గోదావరి.. ధవళేశ్వరానికి 16.27 లక్షల క్యూసెక్కుల వరద

లంక గ్రామాలు నీటమునిగి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
Update: 2022-07-14 14:58 GMT

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తోంది. గంటగంటకు వరద ప్రవాహం విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం ప్రాజెక్టుకు 16.27 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్టు అధికారులు తెలిపారు. లంక గ్రామాలు నీటమునిగి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే పలు గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి ఎగువ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వం సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ధవళేశ్వరం ప్రాజెక్టుకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. స్టేట్‌ కంట్రోల్ రూమ్ వద్ద విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, ఎండీ అంబేద్కర్ పర్యవేక్షిస్తున్నారు.

ఆరు ఎన్డీఆర్‌ఎఫ్‌, నాలుగు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరద సహాయక చర్యల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీ పరీవాహక గ్రామాలు జల దిగ్బంధానికి గురయ్యాయి. మరోవైపు భారీ ఈదురు గాలులు, వర్షంతో పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. డ్రెయిన్లన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలడం వల్ల నదీ పాయలన్నీ ఉధృతంగా ప్రవహిస్తూ సమీప గ్రామాలను ముంచెత్తుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News