పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమే.. - మాజీ మంత్రి పేర్ని నాని

జనసేన పార్టీకి సీట్లు ఇవ్వకపోయినా పర్లేదు.. అధికారం ఇవ్వకపోయినా పర్లేదు.. చంద్రబాబుకు మేలు జరిగితే చాలు అని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారని పేర్ని నాని తెలిపారు.

Advertisement
Update: 2023-04-30 12:35 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమేనని.. ఆయన కోసమే పవన్ జీవిస్తున్నారన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది.. రాజకీయాలు నడిపేది చంద్రబాబు కోసమేనని చెప్పారు. అతడు జీవించి ఉన్నంతవరకు కూడా.. చంద్రబాబు మేలుకోసమే బతుకుతాడన్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యమేనని..వైసీపీ నాలుగేళ్ల నుంచి ఇదే విషయం గురించి చెబుతున్నా ఎవరూ నమ్మలేదని అన్నారు.

ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ అర్థమవుతోందన్నారు. జనసేన పార్టీకి సీట్లు ఇవ్వకపోయినా పర్లేదు.. అధికారం ఇవ్వకపోయినా పర్లేదు.. చంద్రబాబుకు మేలు జరిగితే చాలు అని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారని పేర్ని నాని తెలిపారు. మేము నాలుగేళ్ల నుంచి ఇదే విషయం గురించి చెబుతున్నామని.. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్లే ఓపెన్ అయ్యారని వివరించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు పవన్ కళ్యాణ్ సహాయం చేశారని, 2019 ఎన్నికల్లో చంద్రబాబు వ్యతిరేక ఓటు జగన్ కు రాకుండా బీజేపీతో కలిసి పవన్ పోటీ చేశాడన్నారు.

ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని కలిసి చంద్రబాబును ఏమీ చేయవద్దని బతిమిలాడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు కోసం అందరూ కలిసి రావాలని పవన్ అంటున్నాడని, తమ పార్టీకి పదవులు కూడా అక్కర్లేదని చెబుతున్నాడని పేర్ని నాని చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది.. పార్టీ పెట్టింది.. చంద్రబాబు మేలుకోసం తప్పితే వేరే ఏ కారణం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ బీజేపీతో కలసి ఉండడం కూడా ఒక ఎత్తుగడ అని, పవన్ కళ్యాణ్ డ్రామా ఆడుతున్నాడని.. అది అందరికీ అర్థమైందని పేర్ని నాని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News