టీడీపీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన వ్యాఖ్యలు

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసింది తామని.. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఎన్‌ఆర్‌ఐలకు సీట్లు ఇస్తున్నారని పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Update: 2024-03-15 09:54 GMT

తెలుగుదేశం పార్టీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండించారు. డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా..? అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల వారికి, ఎన్‌ఆర్‌ఐలకు కూడా ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు.

పశ్చిమగోదావరి జిల్లాలో మాలల‌కు ఒక్క‌ సీటు కూడా ఇవ్వకపోవడం అన్యాయమని పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని, టీడీపీలోని కొందరు పెత్తందార్లు దళితులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తాను 20 సంవత్సరాలుగా టీడీపీలోనే ఉంటూ పార్టీకి సేవ చేస్తుంటే.. తనకు సీటు ఇవ్వకపోవడం దారుణమన్నారు. తమ కుటుంబం 1982 నుంచి టీడీపీలోనే ఉందని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసింది తామని.. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఎన్‌ఆర్‌ఐలకు సీట్లు ఇస్తున్నారని పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు మాజీ మంత్రి జవహర్‌కి కూడా టికెట్‌ ఇవ్వలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్లకు కూడా సీట్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. 2015 నుంచి తనను తెలుగుదేశం పార్టీలోని పెత్తందార్లు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News