ఇట్లయితే మళ్లీ జగనే - సీపీఐ రామకృష్ణ

ఒకవేళ వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్నీ విడివిడిగా పోటీ చేయాలన్నదే బీజేపీ రోడ్ మ్యాప్ అయితే... ఇక వైసీపీ నేతలు ప్రశాంతంగా నిద్రపోవచ్చన్నారు. విడివిడిగా విపక్షాలు పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి విజయం సాధించేది వైసీపీనే అని రామకృష్ణ చెప్పారు.

Advertisement
Update: 2022-11-15 06:01 GMT

సీపీఐ రామకృష్ణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ పర్యటన తర్వాత జనసేనలో వస్తున్న మార్పుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి తమకు రోడ్ మ్యాప్ వచ్చేసిందని ఒక చర్చా కార్యక్రమంలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చెప్పగా రామకృష్ణ అభ్యంతరం తెలిపారు.

హోదా, విశాఖ స్టీల్, పోలవరం ఇలా దేనిపైనా ప్రధాని హామీ ఇవ్వలేదని అలాంటప్పుడు ఆ పార్టీకి ఎలా మద్దతు ఇస్తారని రామకృష్ణ ప్రశ్నించారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్నీ విడివిడిగా పోటీ చేయాలన్నదే బీజేపీ రోడ్ మ్యాప్ అయితే... ఇక వైసీపీ నేతలు ప్రశాంతంగా నిద్రపోవచ్చన్నారు. విడివిడిగా విపక్షాలు పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి విజయం సాధించేది వైసీపీనే అని రామకృష్ణ చెప్పారు.

విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తేనే వైసీపీని ఓడించగలమని ఇది వరకు పవన్ చెప్పారని.. అది సరైన ఆలోచన అన్నారు. విపక్షాలు వేర్వేరుగా పోటీ చేస్తే ఒరిగేది ఏమీ ఉండదని మళ్లీ జగనే గెలుస్తారని రామకృష్ణ విశ్లేషించారు.

రామకృష్ణ వ్యాఖ్యలను బొలిశెట్టి ఖండించారు. రామకృష్ణలో ఎల్లో కలర్ కనిస్తోందన్నారు. తాము ఎప్పుడూ చంద్రబాబుతో ఉంటామని చెప్పలేదని... కావాలనే అలాంటి ప్రచారం చేశారని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. మొత్తం మీద బీజేపీ - జనసేన కూటమిలోకి టీడీపీని చేర్చుకునే పరిస్థితులు కనిపించకపోవడంపై రామకృష్ణ బాధపడుతున్నట్టుగా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News