బాబు కుప్పానికి ఏం చేయ‌లేదో చెప్ప‌డానికి చాలా ఉంది.. - కుప్పం స‌భ‌లో సీఎం జ‌గ‌న్

చంద్రబాబు కంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? చేయకూడదనే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? దీన్ని చేతకానితనం అనాలా? లేక చేయకూడదనే దుర్బుద్ధి అనాలా? కుప్పంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ లేదు, మెడికల్ కాలేజీ లేదు.. ప్రతి ఎన్నికల్లో దొంగోట్లు వేయించడానికి మాత్రం చంద్రబాబుకు అనుభవం గురించి ఈ జిల్లాలో కథలు కథలుగా చెప్తారంటూ జ‌గ‌న్ విమ‌ర్శించారు.

Advertisement
Update: 2022-09-23 12:00 GMT

చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో శుక్ర‌వారం ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ టీడీపీ శిబిరంలో, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబులో క‌ల‌వ‌రం రేపుతున్న విష‌యం తెలిసిందే.. ఈ స‌భ‌లో చంద్ర‌బాబు గురించి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి కొన్ని మాటలు మాట్లాడాలంటూ.. ఆయ‌న స‌భ‌లో చంద్ర‌బాబు గురించి ప్ర‌స్తావించారు. మీ ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్, కుప్పానికి నాన్‌ లోకల్‌.. అంటూ విమ‌ర్శించారు. కుప్పానికి బాబు ఏంచేశాడో చెప్పడానికి లేదు కానీ, ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉందని తెలిపారు. ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నార‌ని, ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది పిండుకున్నాడు, తీసుకున్నాడు కానీ..ప్రజలకు ఏం చేయాలన్నదానిపై ఆలోచన మాత్రం చేయలేదని విమ‌ర్శించారు.

మంచి చేయాలన్న తపన, తాపత్రయం చూపించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉండికూడా కుప్పంలో కరువుకు చంద్రబాబు పరిష్కారం చూపలేకపోయాడని జ‌గ‌న్ విమ‌ర్శించారు. కేంద్రంలో రాష్ట్రపతులను మారుస్తానంటాడు.. కేంద్రంలో ప్రధానమంత్రులను కూడా తానే నియమించానని చెప్పుకుంటా ఉంటాడు.. కేంద్రంలో చక్రం తానే తిప్పానని చెప్పే బాబు చివరకు నియోజకవర్గంలో పంపులు తిప్పితే.. నీరు వచ్చే పరిస్థితి కూడా తీసుకుని రాలేకపోయాడని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు.

కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హంద్రీనీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా.. అదిచేస్తే.. ప్రజలు తన మాట వినరని భయపడిపోయాడని విమ‌ర్శించారు. అందుకే ఆ హంద్రీనీవా పనులకు కూడా అవరోధంగా తానే మారాడని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా దీని గురించి పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికలు వచ్చే సరికి తన పార్టీకి చెందిన వారికి మాత్రం ఈ కాంట్రాక్టు ఇచ్చాడని, అందులోనూ కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డాడు తప్ప, కుప్పంకు మాత్రం నీళ్లు తెప్పించుకోలేకపోయాడని చెప్పారు.

వందలకొద్దీ ట్రాక్టర్లతో తాగునీరు పంపిణీ చేశానని చెప్పి.. విపరీతంగా దొంగ అక్కౌంట్లతో దోచేశాడని, ఆ ట్రాక్టర్లు లేకుండా కుప్పానికి నీళ్లు ఇవ్వగలిగితే.. ఎంత బాగుంటుందన్న.. ఆలోచన చేయలేకపోయాడని చెప్పారు. కృష్ణగిరి నుంచి పలమనేరు హైవేకు లింక్‌ఇస్తాన్నాడు.. అదికూడా చేయలేదని విమ‌ర్శించారు. కుప్పం మున్సిపాల్టీలో కనీసం డబుల్‌రోడ్డు కూడా వేయలేకపోయాడు ఈ పెద్దమనిషి అంటూ ఎద్దేవా చేశారు.

ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు లేదని, ఎన్నికలప్పుడు మాత్రం.. ఏకంగా కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతానని కుప్పం ప్రజల చెవుల్లో పువ్వు పెట్టాడని విమ‌ర్శించారు. ఇదే పెద్దమనిషి జాబు కావాలంటే.. బాబు రావాలని అంటాడని, ఎన్నికలయ్యాక జాబులు ఉండవు, బాబు పట్టించుకోడు అంటూ ఎద్దేవా చేశారు. కుప్పం నుంచి నిత్యం 5 వేల మంది ఉపాధి కోసం బెంగళూరు, చెన్నైకి వెళుతున్నార‌ని గుర్తు చేశారు. ఇక్కడ వాళ్లకు ఉద్యోగాలు చూపించాలన్న ఆలోచన ఈ పెద్ద మనిషికి రాదని విమ‌ర్శించారు.

చంద్రబాబు ఏరోజూ ఈ నియోజకవర్గంలో ఉండడు, ఇక్కడకు రాడు, పట్టించుకోడు.. 14 ఏళ్లు సీఎంగా ఉండేందుకు తనకు కుప్పం సహకరించినా, చివరకు రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేకపోయాడని గుర్తు చేశారు. చివరకు రెవెన్యూ డివిజన్‌కోసం జగన్‌కు లేఖ రాస్తాడు.. కాని, జగన్‌ మీవాడు, మంచోడు, మీ బిడ్డ.. మీరు అడిగారు, జగన్ రెవెన్యూ డివిజన్ కుప్పానికి ఇచ్చాడు.. అని ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

చంద్రబాబు కంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? చేయకూడదనే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? దీన్ని చేతకానితనం అనాలా? లేక చేయకూడదనే దుర్బుద్ధి అనాలా? కుప్పంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ లేదు, మెడికల్ కాలేజీ లేదు.. ప్రతి ఎన్నికల్లో దొంగోట్లు వేయించడానికి మాత్రం చంద్రబాబుకు అనుభవం గురించి ఈ జిల్లాలో కథలు కథలుగా చెప్తారంటూ జ‌గ‌న్ విమ‌ర్శించారు.

వెన్నుపోటుకు, దొంగ ఓట్లకు 30 ఏళ్లుగా కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరంటే.. అది చంద్రబాబని జ‌గ‌న్ తెలిపారు. చంద్రబాబు చేస్తున్న మోసానికి, అన్యాయనికి ఇక తలవంచేది లేదని కుప్పం ప్రజలు నిర్ణయించుకుంటే.. అభివృద్ధి వైపు ఒకసారి చూస్తే.. ఎలా ఉంటుందో.. ఒక్కసారి చూస్తే. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో చూపించారని.. అన్నింటా కూడా వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసిందని, కుప్పంలో ప్రజలు తమ బిడ్డ జగన్‌కి ఓటేశారని తెలిపారు.

33 ఏళ్లుగా గెలిపించినా కూడా.. చంద్రబాబుకు ఇక్కడ సొంత ఇల్లు లేదని, సొంతిల్లు సంగతి దేవుడు ఎరుగు, కాని, సొంత ఓటు కూడా లేదని చెప్పారు. కుప్పం తన సొంతం అని చంద్రబాబు ఏనాడూ భావించలేదని, సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఇంద్రభవనం కట్టుకున్నాడు తప్ప, కుప్పంలో ఇల్లు కట్టుకోలేదని జ‌గ‌న్ గుర్తుచేశారు.

బీసీలకు న్యాయం చేశానని రెండు రోజుల క్రితం చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్పాడని, కుప్పంతో మొదలుపెడితే బీసీలకు ప్రతిచోటా ఆయ‌న‌ అన్యాయం చేశాడ‌ని విమ‌ర్శించారు. కుప్పం ఓసీలు పోటీచేయాల్సిన సీటు కాదని, బీసీల సీటని, అత్యధికంగా ఉన్నవారు బీసీలని జ‌గ‌న్ గుర్తు చేశారు. మరి అలాంటిది ఈ సీటు బీసీలకు ఇవ్వకుండా, ఈ బీసీలకు సంబంధించిన సీటును కూడా లాక్కున్నారని విమ‌ర్శించారు. అలాంటిది.. సామాజిక న్యాయం గురించి చంద్రబాబు మాట్లాడితే ఎలా ఉంటుందని ప్ర‌శ్నించారు.

త‌న ప‌రిపాల‌న‌లో కుప్పంలో ఏం జరిగిందో ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ వివ‌రించారు. తాము అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల 3 నెలలు అయ్యిందని, 6 నెలల్లో హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తిచేస్తున్నామ‌ని చెప్పారు. కుప్పంను మున్సిపాల్టీగా చేసింది తామేన‌న్నారు. కుప్పం మున్సిపాల్టీకి రూ.66 కోట్లు అభివృద్ధి పనులకు ఇచ్చింది మీ బిడ్డ.. 55 ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు కుప్పంలో ఏర్పాటు చేసింది.. మీ బిడ్డే.. 6.5 కోట్లతో రెడ్డిపల్లి– రామకుప్పం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఇచ్చిందీ మీబిడ్డే.. కొత్తపేట నుంచి డీకే పల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి పూర్తిచేసింది మీ బిడ్డే.. రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌కాంప్లెక్స్‌ పూర్తిచేసింది కూడా మీ బిడ్డే .. ఒకేషనల్ జూనియర్‌కాలేజీ పనులు పూర్తి చేసింది.. మీ బిడ్డే.. కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు కేటాయించింది కూడా మీ బిడ్డే.. రాళ్ల మడుగూరు జూనియర్‌కాలేజీ పనులు పూర్తిచేసింది మీ బిడ్డే.. నవరత్నాలు పథకాలు అన్నీకూడా కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా.. కుప్పంలో అంతా నావాళ్లే అని అమలు చేశామ‌ని జ‌గ‌న్ చెప్పారు.

డీబీటీ ద్వారా కుప్పం నియోజకవర్గంలో రూ.866 కోట్లు ఇచ్చామ‌న్నారు. నాన్‌డీబీటీ ద్వారా మరో రూ.283 కోట్లు ఇచ్చామ‌ని తెలిపారు. అంటే మొత్తంగా 39 నెలలకాలంలో ఇంటింటికీ మంచి చేస్తూ కేవలం కుప్పం నియోజకవర్గానికి రూ.1149 కోట్లు మీ బిడ్డ ఇచ్చాడని గుర్తు చేశారు. మంచి జరగాలని మనసుతో ఇవన్నీచేసింది మీ బిడ్డేన‌ని జ‌గ‌న్ వివ‌రించారు.

చంద్రబాబు మాత్రం తనకు కావాల్సిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడ్ని చూసుకుంటే చాలు.. ఎవరూ చూపరు, రాయరు, ప్రజలకు అన్యాయం జరుగుతున్నా.. పట్టించుకోరని భావించాడని జ‌గ‌న్ చెప్పారు. భరత్‌ను గెలిపించండి.. ఎమ్మెల్సీగా ఉంటూనే కుప్పానికి ఇవన్నీచేశాడని వివ‌రించారు. గెలిపించండి.. మంత్రిగా పంపిస్తానని ఆయ‌న హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News