తిరుమల లడ్డుకు కేరళ జీడిపప్పు...

టీటీడీలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే చర్యలకు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో టీటీడీ శ్రీకారం చుట్టింది. జీడిపప్పు విషయంలోనూ టీటీడీ కొత్త ఆలోచన చేసింది. తిరుమల లడ్డూలో వాడే జీడిపప్పు సరఫరా కోసం కేరళ ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకోబోతోంది. ఇప్పటికే చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. నాణ్యతలో కేరళ జీడిపప్పుకు మంచి పేరుంది. ఇప్పటికే కేరళ జీడిపప్పును అనేక ప్రముఖ ఆలయాలకు సరఫరా చేస్తున్నారు. […]

Advertisement
Update: 2019-10-02 20:45 GMT

టీటీడీలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే చర్యలకు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో టీటీడీ శ్రీకారం చుట్టింది. జీడిపప్పు విషయంలోనూ టీటీడీ కొత్త ఆలోచన చేసింది.

తిరుమల లడ్డూలో వాడే జీడిపప్పు సరఫరా కోసం కేరళ ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకోబోతోంది. ఇప్పటికే చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. నాణ్యతలో కేరళ జీడిపప్పుకు మంచి పేరుంది.

ఇప్పటికే కేరళ జీడిపప్పును అనేక ప్రముఖ ఆలయాలకు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు తిరుమల లడ్డు కోసం కూడా జీడిపప్పును సరఫరా చేసేలా కేరళ జీడి అభివృద్ధి సంస్థ-కేఎస్‌సీడీసీతో ఒప్పందం చేసుకోబోతోంది.

గతంలో జీడిపప్పును ఈ- టెండర్ల ద్వారా ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేసేవారు. అయితే ప్రైవేట్ సంస్థల నుంచి సరఫరాలో పారదర్శకతపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వస్తువుల సరఫరా చేసుకోవాలని టీటీడీ నిర్ణయించింది… కేరళ ప్రభుత్వ సంస్థతో జీడిపప్పు సరఫరాకు ఒప్పందం చేసుకోబోతోంది. దీని వల్ల అవకతవకలకు ఆస్కారం ఉండదని భావిస్తున్నారు.

ప్రస్తుతం తిరుమలలో రోజుకు నాలుగు లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. రోజుకు 2,840 కిలోల జీడిపప్పును వాడుతున్నారు. ఇప్పటి వరకు బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ జీడిపప్పును సరఫరా చేస్తోంది. ఆ కంపెనీతో ఒప్పందం ముగింపుకు చేరుకుంది. దీంతో కేరళ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి జీడిపప్పు కొనుగోలుకు టీటీడీ సిద్ధమైంది.

టీటీడీకి జీడిపప్పు సరఫరా చేసే ఒప్పందంపై కేఎస్‌సీడీసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదలతో కుదేలైన కేరళ జీడి పరిశ్రమకు ఇది ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇటీవలే తిరుమలలో వాడే బియ్యం విషయంలోనూ టీటీడీ కొత్త ఆలోచనను అమలులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైస్‌ మిల్లర్ల నుంచి నేరుగా బియ్యాన్ని టీటీడీ కొనుగోలు చేస్తోంది. దీని వల్ల నిధుల ఆదాతో పాటు నాణ్యమైన బియ్యం తిరుమలకు సరఫరా అవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News