"గీతా" సారాంశం- ఒకరిపై ఒకరు ఆశలు వదులుకున్నారా?

అత్యంత వివాదాస్పద ఎంపీగా పేరుతెచ్చుకున్న అరకు ఎంపీ కొత్తపల్లి గీత గురించి ఆమె నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా?. అసలు ఏమీ అనుకోవడం లేదు. ఆమె ఉన్నారన్న విషయమే నియోజకవర్గ ప్రజలు మరిచిపోయారు. ఎంపీని నమ్ముకుంటే ఉపయోగం లేదన్న నిర్దారణకు వచ్చేశారు. టీడీపీ నేతలు మాత్రం డ్యామిట్ కథ అడ్డం తిరిగిందని బాధపడుతున్నారు. అరకు పార్లమెంట్‌ జనానికి అంత విసుగు వచ్చిందంటే అది గీతా ప్రభావమే. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె నియోజకవర్గానికి వచ్చింది […]

Advertisement
Update: 2016-09-19 04:20 GMT

అత్యంత వివాదాస్పద ఎంపీగా పేరుతెచ్చుకున్న అరకు ఎంపీ కొత్తపల్లి గీత గురించి ఆమె నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా?. అసలు ఏమీ అనుకోవడం లేదు. ఆమె ఉన్నారన్న విషయమే నియోజకవర్గ ప్రజలు మరిచిపోయారు. ఎంపీని నమ్ముకుంటే ఉపయోగం లేదన్న నిర్దారణకు వచ్చేశారు. టీడీపీ నేతలు మాత్రం డ్యామిట్ కథ అడ్డం తిరిగిందని బాధపడుతున్నారు. అరకు పార్లమెంట్‌ జనానికి అంత విసుగు వచ్చిందంటే అది గీతా ప్రభావమే. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె నియోజకవర్గానికి వచ్చింది కేవలం ఆరు సార్లే. అందులోనూ ఒకసారి స్వచ్చభారత్‌ కోసం, మరోసారి తన పుట్టిరోజు వేడుకల కోసం, ఇంకోసారి దత్తతగ్రామానికి వచ్చి వెళ్లారు. ప్రతి మూడు నెలలకోసారి ఐటీడీఏ పాలకమండలి సమావేశం నిర్వహిస్తుంటారు. గిరిజన ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు వస్తుంటారు. కానీ కొత్తపల్లి గీత మాత్రం ఒక్కసారి కూడా ఐటీడీఏ సమావేశానికి రాలేదు.

హుద్‌హుద్‌ సమయంలో ఒకే ఊరిలో ఐదుగురు గిరిజనులు సజీవ సమాధి అయినప్పుడు కూడా కొత్తపల్లి గీత హైదరాబాద్‌ గీత దాటి రాలేదు. ఇప్పుడు అరకు జనానికి తమకూ ఒక ఎంపీ ఉన్నారని, ఆమె దగ్గరకు వెళ్లి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న ఆలోచన కూడా చచ్చిపోయింది. కొత్తపల్లిగీతకు సంబంధించిన అక్రమాలు, వివాదాలు తెరపైకి వచ్చినప్పుడు మాత్రమే జనం ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నేతలు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. వైసీపీ తరపు నుంచి కొత్తపల్లి గీత గెలిచినప్పటికీ ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు ఆమెను పార్టీలోకి లాగేశారు. ఆ తర్వాత తొలుత ఆమె కులం వివాదం తెరపైకి వచ్చింది. కొత్తపల్లి గీత తమ్ముడు ఎస్టీ కాదని జిల్లా కలెక్టర్ కూడా ధృవీకరించారు. అయితే చంద్రబాబు అండతో కొత్తపల్లి గీత మాత్రం తాను ఎస్టీనేనని సర్టిఫై చేయించుకోగలిగారు.

తర్వాత తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కుమారుడు తన భర్తను కిడ్నాప్ చేశారంటూ కొద్ది నెలల క్రితం మీడియాకు ఎక్కారు గీత. కానీ అది కూడా నాటకమేనని తేలిపోయింది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఏకంగా 5వేల కోట్ల విలువైన భూమిని కొత్తపల్లి గీత కాజేసినట్టు తేలింది. దీంతో టీడీపీ నేతలు ఇబ్బందిపడుతున్నారు. వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు వేసిన ఎత్తు ఇప్పుడు టీడీపీకే ఎదురుతిరిగిందంటున్నారు. కొత్తపల్లి గీత వైసీపీలో ఉండిఉంటే ఈపాటికి ఆ పార్టీని షేక్‌ చేసేవారిమంటున్నారు. జగన్‌ చుట్టూ ఇలాంటి అవినీతిపరులే చేరుతారంటూ ఉదరగొట్టేవారిమని చెబుతున్నారు. కానీ గీతను చంద్రబాబే స్వయంగా గీత దాటించి తీసుకొచ్చి టీడీపీని చిక్కుల్లో పడేశారంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

వైసీపీ నేతలు మాత్రం గీత గీత దాటడం మంచిదే అయిందంటున్నారు. అక్రమార్కులను రక్షించడంలో చంద్రబాబే బెస్ట్ అన్న ఉద్దేశంతోనే కొత్తపల్లి గీత టీడీపీలోకి వెళ్లారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద పరిస్థితి చూస్తుంటే కొత్తపల్లి గీత అరకు ఎంపీగా మరోసారి పోటీ చేసే అవకాశం లేదన్న నిర్దారణకు నియోజకవర్గ ప్రజలు వచ్చారు. అందుకే ఆమెపై వారు ఆశలు వదులుకున్నారు. కొత్తపల్లి గీత కూడా వరుసగా బయటపడుతున్న తన అక్రమాలను చూసిన తర్వాత ఏ పార్టీ కూడా ఇక టికెట్‌ ఇవ్వదన్న భావనకు వచ్చే ఉండాలంటున్నారు. మొత్తం మీద 2019 వరకు అరకు ఎంపీ ఉన్నా లేనట్టే అంటున్నారు లోకల్ జనం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News